Will Smith: ముంబైలో తళుక్కుమన్న ఆస్కార్ ‘చెంపదెబ్బ’ నటుడు విల్‌స్మిత్

  • ఓ ఆధ్యాత్మికవేత్తతో కలిసి కనిపించిన స్మిత్
  • అభిమానులతో కలిసి ఫొటోలకు పోజులు
  • ఆస్కార్ ఘటన తర్వాత తొలిసారి బహిరంగంగా కనిపించిన హాలీవుడ్ నటుడు
Will Smith makes first public appearance after Oscars slap row in India

హాలీవుడ్ ప్రముఖ నటుడు విల్‌స్మిత్ భారత్‌లో తళుక్కుమన్నాడు. ఓ ఆధ్యాత్మికవేత్తతో కలిసి ముంబై విమానాశ్రయంలో కనిపించాడు. ఇతరులతో నవ్వుతూ మాట్లాడుతుండగా కెమెరాలకు చిక్కాడు. అభిమానులతో ఫొటోలు దిగాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బాలీవుడ్ ఫొటోగ్రాఫర్ వైరల్ భయాని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. అయితే, అతడు భారత్‌కు రావడానికి వెనక కారణం తెలియరాలేదు. ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో హోస్ట్‌ను చెంపదెబ్బ కొట్టిన తర్వాత స్మిత్ బహిరంగంగా కనిపించడం ఇదే తొలిసారి. 

జుహులోని జేడబ్ల్యూ మారియట్ హోటల్‌లో బస చేసిన విల్ శనివారం ముంబైని వీడాడు. విల్‌కు భారత్‌తో చాలా కాలంగా మంచి సంబంధం ఉంది. గతంలోనూ పలుమార్లు భారత్‌ను సందర్శించాడు. గంగా హారతి కోసం వారణాసిని సందర్శించిన స్మిత్.. తన వీడియో సిరీస్ కోసం ఆధ్యాత్మికవేత్త సద్గురును కూడా కలుసుకున్నాడు. 

గత నెలలో జరిగిన 94వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో వ్యాఖ్యాత క్రిస్ మాట్లాడుతూ విల్ భార్య జాడా పింకెట్ స్మిత్‌‌పై జోక్ చేశాడు. దీనిని తీవ్రంగా పరిగణించిన స్మిత్ వేదికపైకి వెళ్లి క్రిస్ చెంప పగలగొట్టాడు. ఈ కార్యక్రమాన్ని లైవ్‌లో వీక్షిస్తున్న కోట్లాదిమంది ఇది చూసి ఒక్కసారిగా షాకయ్యారు.  కాగా, ‘కింగ్ రిచర్డ్’ నటనకు గాను స్మిత్‌ను ఉత్తమ నటుడి అవార్డు వరించింది. 

క్రిస్‌ను చెంపదెబ్బ కొట్టిన తర్వాత స్మిత్ తీవ్ర పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. హింస ఏ రూపంలో ఉన్నా అది విధ్వంసకరమైనదేనని పేర్కొన్నాడు. అకాడమీ అవార్డుల కార్యక్రమంలో తన ప్రవర్తన ఆమోదయోగ్యం కాదని, క్షమించరానిదని అన్నాడు. తన భార్య ఆరోగ్య పరిస్థితిపై వేసి జోక్ భరించలేనంతగా ఉండడంతో భావోద్వేగంతో స్పందించానని విచారం వ్యక్తం చేశాడు. 

మరోవైపు, ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన అకాడమీ పదేళ్లపాటు స్మిత్‌పై నిషేధం విధించింది. నిషేధ కాలంలో అతడు ఆస్కార్ సహా అకాడమీకి సంబంధించిన ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనకూడదు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

More Telugu News