Acharya: హైదరాబాద్‌లో 'ఆచార్య' ప్రీ రిలీజ్ వేడుక సంద‌ర్భంగా నేటి సాయంత్రం ట్రాఫిక్‌ ఆంక్షలు

  • యూసఫ్‌గూడలో టీఎస్‌పీఎస్పీ 1వ బెటాలియన్ మైదానంలో వేడుక
  • ప‌రిస‌ర‌ ప్రాంతాల్లో ట్రాఫిక్ అధికంగా ఉండే అవ‌కాశం 
  • యూసఫ్‌గూడ వైపు వెళ్లే దారుల్లో ట్రాఫిక్‌ మళ్లిస్తామ‌న్న‌ పోలీసులు
  • వేడుక‌కు పాస్‌లు ఉన్నవారికి మాత్రమే అనుమతి
traffic restriction for Acharya pre release

మెగాస్టార్‌ చిరంజీవి, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌ కలిసి నటించిన 'ఆచార్య' సినిమా ప్రీ రిలీజ్‌ వేడుక నేటి సాయంత్రం జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడలో టీఎస్‌పీఎస్పీ 1వ బెటాలియన్ మైదానంలో ఈ వేడుక జరుగనున్న నేప‌థ్యంలో దాని ప‌రిస‌ర‌ ప్రాంతాల్లో ట్రాఫిక్ అధికంగా ఉండే అవ‌కాశం ఉంది. దీంతో ప‌లు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. 

ఈ రోజు సాయంత్రం 5 నుంచి రాత్రి 11 గంటల వరకు ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను నిలిపివేస్తామ‌ని, లేదంటే యూసఫ్‌గూడ వైపు వెళ్లే దారుల్లో ట్రాఫిక్‌ మళ్లిస్తామ‌ని ట్రాఫిక్ పోలీసులు ప్ర‌క‌టించారు. అలాగే, ప్రీ రిలీజ్ వేడుక‌కు పాస్‌లు ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తామని స్ప‌ష్టం చేశారు. 

మైత్రీవనం నుంచి వచ్చే వాహనాలను యూసఫ్‎గూడ చెక్‌పోస్ట్‌ వైపునకు అనుమతించబోమ‌ని అన్నారు. ఆ వాహ‌నాల‌ను అక్క‌డి సవేరా ఫంక్షన్‌ హాల్‌ నుంచి కృష్ణకాంత్‌ పార్క్‌, సత్యసాయి నిగమాగమం, కమలాపురి వైపు మ‌ళ్లిస్తామ‌ని అన్నారు. జూబ్లీహిల్స్‌ నుంచి అమీర్‌పేట వైపునకు వెళ్లే వాహనాలను శ్రీనగర్‌ కాలనీ నుంచి సత్యసాయి నిగమాగమం వైపు మళ్లిస్తామ‌ని అన్నారు.

More Telugu News