Gudivada Amarnath: వైసీపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవాలన్న ప్రశాంత్ కిశోర్.. మంత్రి గుడివాడ అమర్ నాథ్ ఘాటు స్పందన!

  • కాంగ్రెస్ ను భూస్థాపితం చేసేందుకే వైసీపీ పుట్టిందన్న అమర్ నాథ్
  • సోనియాను ఎదిరించి నిలబడ్డ ఏకైక మగాడు జగన్ అని వ్యాఖ్య
  • వ్యూహకర్తలు కేవలం సలహాలను మాత్రమే ఇస్తారన్న మంత్రి 
Gudivada Amarnath response on Prashant Kishor suggestion to Congress to join hands with YSRCP

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యతను భుజానికెత్తుకున్న సంగతి తెలిసిందే. సోనియాగాంధీతో పాటు ఆ పార్టీ అగ్ర నేతలకు ఇప్పటికే ఆయన తన వ్యూహాలను తెలియజేశారు. ఏయే రాష్ట్రాల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలనే ప్లాన్ ను వివరించారు. ఈ క్రమంలో ఏపీలో వైసీపీతో పొత్తు పెట్టుకుంటే బాగుంటుందని ఆయన సూచించారు. ఈ వార్త చర్చనీయాంశంగా మారింది. 

ప్రస్తుతం ఢిల్లీ స్థాయిలో బీజేపీతో ముఖ్యమంత్రి జగన్ సానుకూలంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ తో జగన్ పొత్తు పెట్టుకుంటారా? అనే సందేహం అందరిలో తలెత్తుతోంది. ఏపీలో వైసీపీ కోసం పీకే పని చేస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ అధికారాన్ని కైవసం చేసుకోవడంలో పీకే టీమ్ కీలకమైన పాత్రను పోషించింది. ఈ నేపథ్యంలో, పీకే సలహాను జగన్ ఆచరిస్తారా? లేదా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. 

మరోవైపు, పీకే సలహాపై ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ స్పందించారు. కాంగ్రెస్ ను భూస్థాపితం చేసేందుకే వైసీపీ పుట్టిందని చెప్పారు. ఎన్నికల వ్యూహకర్తలు కేవలం సలహాలను మాత్రమే ఇస్తారని... వాటిని అమలు చేయాలా? వద్దా? అనే నిర్ణయాన్ని పార్టీ నాయకుడే తీసుకుంటారని అన్నారు. 135 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ సీట్ల కోసం వెతుక్కునే పరిస్థితిని తీసుకొచ్చింది వైసీపీనే అని చెప్పారు. సోనియాను, కాంగ్రెస్ ను ఎదిరించి నిలబడ్డ ఏకైక మగాడు జగనే అని అన్నారు.

More Telugu News