YSRCP: గుడివాడ‌లో మ‌ట్టి మాఫియా అరాచ‌కం... జేసీబీతో నెట్టి ఆర్ఐపై హ‌త్యాయత్నం

  • గుడివాడ‌లో జోరుగా సాగుతున్న అక్ర‌మ మ‌ట్టి త‌ర‌లింపు
  • అడ్డుకునేందుకు సిబ్బందితో క‌లిసి వెళ్లిన ఆర్ఐ అర‌వింద్‌
  • జేసీబీతో నెట్టి ఆర్ఐని హ‌త్య చేసేందుకు మాఫియా య‌త్నం
  • త్రుటిలో త‌ప్పించుకున్న అర‌వింద్‌

కృష్ణా జిల్లా గుడివాడ‌లో మ‌ట్టిని అక్ర‌మంగా త‌ర‌లించే మాఫియా దారుణానికి తెగ‌బ‌డింది. మ‌ట్టి త‌ర‌లింపును అడ్డుకునేందుకు య‌త్నించిన రెవెన్యూ ఇన్‌స్పెక్ట‌ర్‌ను ఏకంగా జేసీబీతో కొట్టి హ‌త్య చేసేందుకు య‌త్నించింది. గురువారం రాత్రి జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌పై రెవెన్యూ ఉద్యోగ సంఘాలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి. ఆర్ఐపై దాడికి య‌త్నించిన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సంఘాల నేత‌లు డిమాండ్ చేస్తున్నారు.

ఈ ఘ‌ట‌న పూర్తి వివ‌రాల్లోకి వెళితే.. గుడివాడ ప‌రిధిలో గ‌త కొంత‌కాలంగా అధికార పార్టీ నేతల అండతో మ‌ట్టి అక్ర‌మ త‌ర‌లింపు భారీగా జ‌రుగుతోంద‌న్న ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. దీనిపై స‌మాచారం అందుకున్న ఆర్ఐ అర‌వింద్ ఈ దందాను అడ్డుకునేందుకు త‌న సిబ్బందితో క‌లిసి వెళ్లారు. అర‌వింద్ య‌త్నాల‌ను అడ్డుకున్న మ‌ట్టి మాఫియా ఆయ‌న‌పై దాడికి దిగింది. 

ఈ క్ర‌మంలో జేసీబీతో నెట్టి ఆయ‌నను హ‌త్య చేసేందుకు మాఫియా య‌త్నించింది. అయితే జేసీబీ నుంచి ప‌క్క‌కు త‌ప్పుకున్న అర‌వింద్ తృటిలో ప్రాణాపాయం నుంచి త‌ప్పించుకున్నారు. ఈ ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న రెవెన్యూ ఉద్యోగ సంఘాలు అర‌వింద్‌కు అండ‌గా నిలిచాయి. అర‌వింద్‌ను హ‌త్య చేసేందుకు య‌త్నించిన వారిని అరెస్ట్ చేయ‌డంతో పాటు వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సంఘం నేత‌లు డిమాండ్ చేస్తున్నారు.

More Telugu News