Kakani Govardhan Reddy: మంత్రి కాకాణిపై ఫోర్జరీ కేసు వ్యవహారంలో వెలుగులోకి మరో ట్విస్ట్!

  • కేసు డాక్యుమెంట్లు తమకు పంపాలని విజయవాడలోని ప్రత్యేక కోర్టు ఆదేశం
  • అన్నీ సిద్ధం చేశాక చోరీ
  • స్వాధీనం చేసుకున్న పేపర్లను కోర్టుకు పంపామంటున్న పోలీసులు
  • అందలేదంటున్న విజయవాడ న్యాయవాద వర్గాలు
another Twist in minister Kakani Govardhan Reddy forgery Case

ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై నమోదైన ఫోర్జరీ కేసుకు సంబంధించి మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. నెల్లూరు నాలుగో ఏడీఎం కోర్టులో డాక్యుమెంట్ల చోరీకి సరిగ్గా వారం క్రితం ఎంపీ, ఎమ్మెల్యేలపై నమోదైన కేసులను విచారించే విజయవాడలోని ప్రత్యేక న్యాయస్థానం నెల్లూరు కోర్టుకు ఉత్తర్వులు పంపిస్తూ.. విచారణలో ఉన్న ప్రజాప్రతినిధుల కేసులను తమకు బదిలీ చేయాలని, ఆ కేసులకు సంబంధించి అన్ని డాక్యుమెంట్లను తమకు పంపాలని ఆదేశించింది. స్పందించిన కోర్టు మంత్రి కాకాణిపై నమోదైన 11 కేసులను బదిలీ చేసి, వాటికి సంబంధించిన డాక్యుమెంట్లను విజయవాడ ప్రత్యేక న్యాయస్థానంలో అప్పగించేందుకు రెడీ అయింది. 

అంతలోనే ఈ నెల 13న ఆ డాక్యుమెంట్లు చోరీకి గురికావడం కలకలం రేపింది. అయితే, కుక్కలు మొరగడంతో దొంగలు కోర్టు హాలులోకి పరిగెత్తారని, ఈ క్రమంలో అక్కడ పాతవస్తువులను దొంగిలించేందుకు ప్రయత్నించారని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఆ డాక్యుమెంట్లను ఎత్తుకెళ్లారని చెప్పడంపై ప్రతిపక్ష నేతలు సందేహాలు వ్యక్తం చేశారు.

కాగా, చోరీ జరిగిన స్థలంలో చెల్లాచెదురుగా పడిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుని విజయవాడలోని ప్రత్యేక న్యాయస్థానానికి అప్పగించినట్టు నెల్లూరు పోలీసులు చెబుతున్నప్పటికీ, అవి తమకు అందలేదని విజయవాడ న్యాయవాద వర్గాలు చెబుతున్నాయి.

More Telugu News