Royal Challengers Bangalore: బ్యాట్‌తో డుప్లెసిస్.. బాల్‌తో జోష్.. లక్నోపై బెంగళూరు విజయం

  • నాలుగు పరుగులతో సెంచరీ చేజార్చుకున్న డుప్లెసిస్
  • నాలుగు వికెట్లు తీసి లక్నోను దెబ్బకొట్టిన హేజిల్‌వుడ్
  • రెండో స్థానానికి దూసుకెళ్లిన ఆర్సీబీ
  • ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌’గా డుప్లెసిస్
RCB jump to second spot after du Plessis special

లక్నో సూపర్ జెయింట్స్‌తో గత రాత్రి జరిగిన ఐపీఎల్ 31వ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు డుప్లెసిస్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో 6 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. అనంతరం 182 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కేఎల్ రాహుల్ సేన 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 163 పరుగులు మాత్రమే చేసి పరాజయం పాలైంది. 

కెప్టెన్ కేఎల్ రాహుల్ (30), కృనాల్ పాండ్యా (42), స్టోయినిస్ (24) మినహా ఎవరూ పెద్దగా రాణించలేకపోయారు. బెంగళూరు బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ పదునైన బంతులను ఎదుర్కొనేందుకు ఇబ్బంది పడిన లక్నో బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఫలితంగా లక్నో 18 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లు ఆడిన లక్నోకు ఇది మూడో ఓటమి కాగా, బెంగళూరు ఐదో విజయం సాధించి రెండో స్థానానికి దూసుకెళ్లింది.

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 7 పరుగులకే రెండు, 62 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన వేళ కెప్టెన్ డుప్లెసిస్ సమయోచితంగా ఆడాడు. సహచరులు ఒక్కొక్కరే వెనుదిరుగుతున్నా క్రీజులో పాతుకుపోయి బౌలర్లకు కొరకరాని కొయ్యగా తయారయ్యాడు. 

గ్లెన్ మ్యాక్స్‌వెల్ (11 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్‌తో 23), షాబాజ్ అహ్మద్ (22 బంతుల్లో ఫోర్‌తో 26) కాస్తంత అండగా నిలవడంతో డుప్లెసిస్ చెలరేగిపోయాడు. 64 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 96 పరుగులు చేసి త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. అతడి బాదుడుకు బెంగళూరు స్కోరు అమాంతం పెరిగింది. దినేశ్ కార్తీక్ 13 పరుగులు చేశాడు. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టిన డుప్లెసిస్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఐపీఎల్‌లో నేడు ఢిల్లీ కేపిటల్స్-పంజాబ్ కింగ్స్ జట్లు తలపడతాయి.

More Telugu News