UP: యూపీలో మత కార్యక్రమాలకు యోగి సర్కారు కొత్త నిబంధన

  • ఢిల్లీలో హన్ మాన్ శోభా యాత్ర సందర్భంగా జరిగిన దాడుల నేపథ్యంలో కొత్త రూల్స్ 
  • శాంతి, సామరస్యాన్ని కాపాడుతామంటూ నిర్వాహకులు అఫిడవిట్ ఇవ్వాలి   
  • ఉల్లంఘించిన వారి పట్ల కఠినంగా వ్యవహరించాలంటూ ఆదేశాలు 
  • కొత్త కార్యక్రమాలకు అనుమతులు వద్దన్న సీఎం  
Organisers affidavit must for religious processions UP CM

ఉత్తరప్రదేశ్ లోని యోగి ఆదిత్యనాథ్ సర్కారు మతపరమైన కార్యక్రమాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. సమావేశాలు, ఊరేగింపులకు నిర్వాహకుల నుంచి తప్పనిసరిగా అఫిడవిట్ (ప్రమాణపత్రం) తీసుకోవాలని ఆదేశించారు. ఢిల్లీలో హన్ మాన్ శోభా యాత్ర చేస్తున్న వారిపై దాడులు జరిగిన నేపథ్యంలో యూపీ సర్కారు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

సోమవారం రాత్రి ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి యోగి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. రంజాన్, అక్షయ తృతీయ ఒకే రోజు వస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులను కోరారు. 

‘‘అనుమతి ఇచ్చే ముందే శాంతి, సామరస్యాన్ని కాపాడుతామంటూ నిర్వాహకుల నుంచి అఫిడవిట్ తప్పకుండా తీసుకోవాలి. సంప్రదాయంగా వస్తున్న మతపరమైన కార్యక్రమాలకే అనుమతి ఇవ్వండి. కొత్త కార్యక్రమాలకు అనుమతులు వద్దు’’ అని యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు.

రానున్న పండుగల నేపథ్యంలో శాంతియుత వాతావరణానికి వీలుగా తమ పరిధిలోని మత నేతలు, ప్రముఖులతో వచ్చే 24 గంటల్లో చర్చలు నిర్వహించాలని డైరెక్టర్ జనరల్ నుంచి స్టేషన్ హౌస్ అధికారుల వరకు అందరికీ ఆదేశాలు జారీ చేశారు. ‘‘సామరస్యాన్ని దెబ్బతీసే ప్రకటనలు చేసే వారి విషయంలో కఠినంగా వ్యవహరించండి’’ అని కోరారు.

More Telugu News