IPL 2022: చాహల్ హ్యాట్రిక్.. నరాలు తెగే ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌ను వరించిన విజయం

  • ఈ సీజన్‌లో అత్యధిక స్కోరు సాధించిన రాజస్థాన్
  • తొలుత బట్లర్ శతకబాదుడు..ఆపై చాహల్ వికెట్ల వేట
  • శాంసన్, ఫించ్ పోరాటం వృథా
  • ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా చాహల్
Buttler and Chahal help RR clinch nail biter

చప్పగా సాగుతున్నట్టు అనిపిస్తున్న ఐపీఎల్‌లో గత రాత్రి రాజస్థాన్ రాయల్స్-కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ అసలైన మజా పంచింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ ప్రేక్షకులను మునివేళ్లపై నిలబెట్టింది. తొలుత బట్లర్ వీరబాదుడుతో ఈ సీజన్‌లో రెండో సెంచరీ సాధించాడు. ఫలితంగా రాయల్స్ 217 పరుగులు సాధించింది. ఆ తర్వాత బౌలింగులో యుజ్వేంద్ర చాహల్ హ్యాట్రిక్ సాధించి మ్యాచ్‌ను కేకేఆర్ చేతుల్లోంచి లాగేసుకున్నాడు.

218 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతాకు ఆరంభం కలిసి రాలేదు. ఒక్క బంతి కూడా ఆడకుండానే ఓపెనర్ సునీల్ నరైన్ రనౌట్ అయ్యాడు. అయితే, ఆ తర్వాత జట్టు అనూహ్యంగా పుంజుకుంది. అరోన్ ఫించ్ (28 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 58), కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (51 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 85) బ్యాట్‌తో బౌలర్ల పనిపట్టడంతో జట్టు విజయం దిశగా సాగుతున్నట్టుగా అనిపించింది. వారిద్దరూ క్రీజులో ఉన్నంత వరకు విజయం కేకేఆర్ చేతుల్లోనే ఉంది. 

ఈ క్రమంలో అరోన్ ఫించ్ అవుటయ్యాడు. అయినప్పటికీ కెప్టెన్ క్రీజులో ఉండడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. అయితే, ఆ తర్వాత వచ్చిన నితీశ్ రాణా 18 పరుగులు మాత్రమే చేసి వెనుదిరగడం, ఆ తర్వాత బౌలర్లు మరింత ఒత్తిడి పెంచడంతో మ్యాచ్ క్రమంగా కేకేఆర్ చేయిదాటింది. దీనికితోడు యుజ్వేంద్ర చాహల్ బంతితో చేసిన మ్యాజిక్‌కు కేకేఆర్ బ్యాటర్లు క్రీజులోకి వచ్చినట్టే వచ్చి వెనుదిరిగారు. 

చాహల్ వేసిన 17వ ఓవర్ నాలుగో బంతికి సెంచరీ దిశగా సాగుతున్నట్టు అనిపించిన శ్రేయాస్ అయ్యర్‌ అవుటయ్యాడు. ఐదో బంతికి శివమ్ మావీ గోల్డెన్ డక్ అయ్యాడు. ఇక, చివరి బంతికి పాట్ కమిన్స్ ను కూడా పెవిలియన్ పంపిన చాహల్ హ్యాట్రిక్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో 180 పరుగులకే కేకేఆర్ 8 వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచింది. అయితే, 18వ ఓవర్లో ఉమేశ్ యాదవ్ మెరుపులు మెరిపించడంతో మళ్లీ ఉత్కంఠ మొదలైంది. ఆ ఓవర్‌లో ఉమేశ్ రెండు సిక్సర్లు, ఒక ఫోర్ బాది స్కోరును 200కు చేర్చాడు. 

చివరి రెండు ఓవర్లలో విజయానికి 18 పరుగులు అవసరం కాగా, 19వ ఓవర్‌లో 7 పరుగులు వచ్చాయి. చివరి ఓవర్‌లో విజయానికి 11 పరుగులు అవసరం కాగా, తొలి బంతికి రెండు పరుగులు వచ్చాయి. అయితే, ఆ తర్వాతి బంతికే జాక్సన్(8) అవుటయ్యాడు. మూడో బంతికి ఒక్క పరుగు వచ్చింది. నాలుగో బంతికి ఉమేశ్ యాదవ్ (21) అవుట్ కావడంతో కేకేఆర్ కథ ముగిసింది. 7 పరుగుల తేడాతో రాజస్థాన్ విజయం సాధించింది. 

ఈ విజయంతో రాజస్థాన్ రెండో స్థానానికి చేరుకుంది. రాజస్థాన్ బౌలర్లలో చాహల్‌కు 5 వికెట్లు దక్కగా, ఓబెడ్ మెక్‌కాయ్ రెండు వికెట్లు తీసుకున్నాడు. హ్యాట్రిక్‌తో కేకేఆర్‌ను కూల్చిన చాహల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ ఈ సీజన్‌లోనే అత్యధికంగా 217 పరుగుల స్కోరు సాధించింది. బట్లర్ ఈ సీజన్‌లో రెండో సెంచరీ సాధించాడు. ఐపీఎల్‌‌లో అతడికిది మూడోది. మొత్తంగా 61 బంతులు ఎదుర్కొన్న బట్లర్ 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 103 పరుగులు చేయగా, పడిక్కల్ 24, సంజు శాంసన్ 38, హెట్మెయిర్ 26 పరుగులు చేశారు. కోల్‌కతా బౌలర్లలో నరైన్ రెండు వికెట్లు తీసుకున్నాడు.

More Telugu News