Amway: ఆమ్‌వేకు షాకిచ్చిన ఈడీ.. రూ.757 కోట్ల ఆస్తుల జ‌ప్తు

  • రూ.411.83 కోట్ల విలువ చేసే స్థిర‌, చరాస్తుల సీజ్
  • 36  బ్యాంకు ఖాతాల్లో ఉన్న 345.94 కోట్ల జ‌ప్తు
  • గొలుసు క‌ట్టు వ్యాపారం మోసం కేసులో ఆమ్‌వేపై ఈడీ చ‌ర్య‌లు
Enforcement Directorate attaches amway properties

గొలుసు క‌ట్టు వ్యాపారంలో భారీ నెట్‌వ‌ర్క్‌ను సొంతం చేసుకున్న ఆమ్‌వే సంస్థ‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) సోమ‌వారం గ‌ట్టి షాకిచ్చింది. ఆమ్‌వేకు చెందిన రూ.757.77 కోట్ల ఆస్తుల‌ను సీజ్ చేస్తూ ఈడీ కీల‌క నిర్ణయం తీసుకుంది. జ‌ప్తు చేసిన ఆస్తుల్లో స్థిర, చ‌రాస్తుల‌తో పాటు బ్యాంకు ఖాతాల్లోని న‌గ‌దు నిల్వ‌లు కూడా ఉండ‌టం గ‌మ‌నార్హం.

గొలుసు క‌ట్టు వ్యాపారం మోసం కేసులో ఆమ్‌వే సంస్థ‌పై ఇదివ‌ర‌కే ప‌లు కేసులు న‌మోదు కాగా.. వాటి ఆధారంగా ఈడీ కూడా ఆమ్‌వేపై కేసు న‌మోదు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ప‌లు కీల‌క ఆధారాల‌ను సేక‌రించిన ఈడీ అధికారులు వాటిని ఈడీ కోర్టుకు స‌మ‌ర్పించారు. 

అనంతరం కోర్టు ఆదేశాల‌తో ఆమ్‌వేకు చెందిన  రూ.757.77 కోట్ల ఆస్తుల‌ను అటాచ్ చేశారు. అటాచ్ చేసిన ఆస్తుల్లో త‌మిళ‌నాడులోని దిండిగ‌ల్ జిల్లాలోని సంస్థ ప‌రిశ్ర‌మ భ‌వ‌నం, యంత్రాలు ఉన్నాయి. రూ.411.83 కోట్ల విలువ చేసే స్థిర‌, చరాస్తులు సీజ్ చేసిన ఈడీ.. 36 బ్యాంకు ఖాతాల్లో ఉన్న 345.94 కోట్లను జ‌ప్తు చేసింది.

More Telugu News