LIC: ఎల్ఐసీలో ఎఫ్డీఐలకు లైన్ క్లియర్.. ‘ఫెమా’ నిబంధనలు మార్చిన కేంద్రం

  • నోటిఫికేషన్ విడుదల
  • త్వరలోనే ఎల్ఐసీ ఐపీవో
  • తన వాటాను అమ్మేస్తున్న కేంద్రం
  • 20% ఎఫ్ డీఐలకు ఆహ్వానం 
Center Amends FEMA Rules makes way for FDIs

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్డీఐ) లైన్ క్లియర్ అయింది. విదేశీ మార్పిడి నిర్వహణ చట్టం (ఫెమా)లో కేంద్ర ప్రభుత్వం నిబంధనలను సవరించింది. దీంతో ఎల్ఐసీలో 20 శాతం ఎఫ్డీఐలకు అవకాశం కల్పించింది. కాగా, ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీవో) ద్వారా ప్రభుత్వం తన వాటాను తగ్గించుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. 

ఐపీవో కోసం ఈ ఏడాది ఫిబ్రవరిలోనే డ్రాఫ్డ్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (డీఆర్ హెచ్ పీ)ని సెబీకి ఎల్ఐసీ సమర్పించింది. దానికి గత నెలలోనే సెబీ ఆమోదం తెలిపింది. ఈ క్రమంలోనే ప్రభుత్వ వాటాను విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు మళ్లించాలని కేంద్రం నిర్ణయం తీసుకుని గత నెల 14న ఎఫ్ డీఐ విధానాల్లో పలు మార్పులను చేసింది. అయితే, ఆ విధానాలు అమల్లోకి రావడానికి, విదేశీ సంస్థలు ఎల్ఐసీ షేర్లను కొని పెట్టుబడులు పెట్టాలన్నా ముందుగా ఎఫ్డీఐ విధాన మార్పులపై ఫెమా నోటిఫికేషన్ ను విడుదల చేయాల్సి ఉంటుంది. 

ఈ క్రమంలోనే ఇవాళ ఫెమా నోటిఫికేషన్ ను కేంద్రం విడుదల చేసింది. ఆటోమేటిక్ రూట్ ద్వారా 20 శాతం ఎఫ్డీఐలకు ఆహ్వానం పలికింది. ఏ పెట్టుబడులైనా ఎల్ఐసీ చట్టం 1956 ప్రకారమే జరగాలని ఆ నోటిఫికేషన్ లో పేర్కొంది.

More Telugu News