Crime News: కుమారుడి రెండో పుట్టినరోజు నాడే.. యువ మహిళా లాయర్ ఆత్మహత్య

  • హైదరాబాద్ లోని చందానగర్ లో విషాదం
  • భర్తతో కొన్ని రోజులుగా గొడవ
  • చదువుకైన ఖర్చు తిరిగిచ్చేయాలంటూ మేనమామ వేధింపులు
  • డబ్బులిస్తుండడంతో దంపతుల మధ్య కలహాలు
Young Women Lawyer Kills Self On Her son Second Birth Day

భర్తతో గొడవ పెట్టుకున్న ఓ యువ మహిళా న్యాయవాది ఆత్మహత్యకు పాల్పడింది. రెండేళ్ల కొడుకు ఉన్నాడని కూడా ఆలోచించకుండా.. అతడి పుట్టినరోజునాడే క్షణికావేశంలో ప్రాణాలను తీసుకుంది. ఈ విషాద ఘటన హైదరాబాద్ లోని చందానగర్ లో జరిగింది. లక్ష్మీ విహార్ ఫేజ్ 1 డిఫెన్స్ కాలనీలో నివాసముంటున్న న్యాయవాది శివానీ.. తాను నివసిస్తున్న భవనం నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆమె మృతికి సంబంధించిన వివరాలను శివానీ తల్లి హేమ వెల్లడించారు. 

చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో మేమమామ చదివించాడని, లాయర్ చేశాడని చెప్పారు. అయితే, ఐదేళ్ల కిందట అర్జున్ అనే యువకుడిని ఆమె ప్రేమించి పెళ్లి చేసుకుందన్నారు. ఈ క్రమంలోనే మేనమామతో శివానీకి గొడవలు ఎక్కువయ్యాయని, చదువులకు రూ.10 లక్షలు ఖర్చు చేశానని, ఆ డబ్బంతా ఇవ్వాలని వేధించాడని చెప్పారు. దీంతో శివానీ తన సంపాదనను మేనమామకు ఇచ్చేస్తోందని పేర్కొన్నారు. 

దీంతో శివానీ భర్త ఆ విషయంలో గొడవపడేవాడని, ఆ డబ్బు ఎలా ఇస్తావంటూ శివానీని ప్రశ్నించేవాడని హేమ చెప్పారు. శనివారం రాత్రి కూడా దంపతుల మధ్య గొడవ జరిగిందని తెలిపారు. ఇవాళ వారి బిడ్డ రెండో పుట్టినరోజును జరుపుకోవాల్సిన రోజే.. శివానీ బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుందని ఆవేదన వ్యక్తం చేసింది. కాగా, మృతురాలి తల్లి, సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. శివానీ భర్త అర్జున్ చందానగర్ పోలీసులకు లొంగిపోయాడు. 

More Telugu News