Tirumala: ఒక్క‌రోజే 88,748 మంది!... కోవిడ్ త‌ర్వాత రికార్డు స్థాయిలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులు!

  • స‌ర్వ ద‌ర్శ‌నం ద్వారా 46,400 మందికి స్వామి వారి ద‌ర్శ‌నం
  • నేటి నుంచి మూడు రోజుల పాటు వసంతోత్స‌వాలు
  • మూడు రోజుల పాటు ఆర్జిత సేవ‌ల ర‌ద్దు
On Wednesday alone a total of 88748 devotees visited tirumala

క‌లియుగ దైవం తిరుమ‌ల శ్రీవేంక‌టేశ్వ‌ర స్వామిని బుధ‌వారం రికార్డు స్థాయిలో భ‌క్తులు ద‌ర్శించుకున్నారు. బుధ‌వారం ఒక్క రోజే ఏకంగా 88,748 మంది భ‌క్తులు స్వామి వారిని ద‌ర్శించుకున్నారు.  కోవిడ్ త‌ర్వాత ఇంత పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు స్వామి వారిని దర్శించడం ఇదే తొలిసారి. సర్వదర్శన క్యూ లైను ద్వారా స్వామివారిని 46,400 మంది భక్తులు దర్శించుకోవ‌డం గ‌మ‌నార్హం. 

రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన క్యూ లైను ద్వారా 25,819 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోగా, వర్చువల్ సేవా టిక్కెట్లు, సేవా టికెట్లు, టూరిజం శాఖ కేటాయింపుల ద్వారా 16,529 మంది భక్తులు స్వామి వారిని ద‌ర్శించుకున్నారు. మొత్తంగా బుధ‌వారం నాడు స్వామి వారిని 88,748 మంది భ‌క్తులు ద‌ర్శించుకున్నారు.

ఇదిలా ఉంటే.. గురువారం నుంచి మూడు రోజుల పాటు శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. నేటి నుంచి మూడు రోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది.

More Telugu News