Andhra Pradesh: అగ్నిప్రమాదంపై జగన్ తీవ్ర దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం ప్రకటన

  • బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన సీఎం
  • తీవ్రంగా గాయపడిన వారికి రూ. 5 లక్షలు, స్వల్పంగా గాయాలైన వారికి రూ. 2 లక్షల చొప్పున పరిహారం
  • ప్రమాదంపై దర్యాప్తునకు ఆదేశం
AP CM Jagan Responds on blast at chemical factory

ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ రసాయన పరిశ్రమలో గత రాత్రి జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో ఆరుగురు మృతి చెందడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. అలాగే, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 5 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ. 2 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్టు తెలిపారు.

ప్రమాదంపై దర్యాప్తునకు ఆదేశించారు. క్షతగాత్రులకు పూర్తిస్థాయిలో వైద్యసాయం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పోరస్ రసాయన పరిశ్రమలోని యూనిట్-4లో గత రాత్రి గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. దీంతో రియాక్టర్ పెద్ద శబ్దంతో పేలిపోయింది. ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు మృతి చెందారు. క్షతగాత్రులను తొలుత నూజివీడు ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వారిని అక్కడి నుంచి విజయవాడకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

More Telugu News