TTD: పెరిగిన భక్తుల రద్దీ... తిరుమల వైకుంఠం-2 కంపార్ట్ మెంట్లను సిద్ధం చేస్తున్న టీటీడీ

  • సాధారణ స్థితికి కరోనా వ్యాప్తి
  • తిరుమలకు తండోపతండాలుగా భక్తులు
  • సర్వదర్శనం టోకెన్ల క్యూలైన్లలో తోపులాట
  • రెండేళ్లుగా మూసి ఉంచిన వైకుంఠం-2
  • తాజాగా శుద్ధి చేయిస్తున్న టీటీడీ
TTD makes arrangements for pilgrims

దేశంలో కొవిడ్ పరిస్థితులు సద్దుమణగడంతో తిరుమల పుణ్యక్షేత్రానికి భక్తుల తాకిడి అధికమైంది. ఇవాళ సర్వదర్శనం టోకెన్ల జారీకి భక్తులు పోటెత్తడంతో క్యూలైన్లలో భారీ తోపులాట చోటుచేసుకుని పలువురికి గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో, టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల వైకుంఠం-2 కాంప్లెక్స్ లోని కంపార్ట్ మెంట్లను మళ్లీ వినియోగంలోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు ప్రారంభించింది. 

కరోనా పరిస్థితుల కారణంగా వైకుంఠం-2 కాంప్లెక్స్ ను టీటీడీ గత రెండేళ్లుగా మూసివేసింది. తాజాగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, వైకుంఠం-2 కాంప్లెక్స్ లో రెండేళ్లుగా నిరుపయోగంగా ఉన్న కంపార్ట్ మెంట్లను శుద్ధి చేయిస్తోంది. దర్శన టికెట్లు లేకున్నా నేరుగా అనుమతించాలని నిర్ణయించింది. దర్శన టికెట్లు లేకుండా తిరుమల వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నారు. 

దర్శన టికెట్లు లేని భక్తులను లేపాక్షి నుంచి క్యూలైన్లలోకి అనుమతించనున్నారు. వైకుంఠం-2 క్యూ కాంప్లెక్స్ లోని భక్తులకు రేపు శ్రీవారి దర్శనం కల్పిస్తామని టీటీడీ అధికారులు వెల్లడించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. వైకుంఠం-2లోని భక్తులకు తాగునీరు, భోజన సౌకర్యాలు కల్పిస్తున్నట్టు చెప్పారు. 

అటు, లడ్డూ టోకెన్ల జారీకి కూడా కంప్యూటర్లను సిద్ధం చేస్తున్నారు. అంతేకాదు, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుమలలో రేపటి నుంచి ఐదు రోజుల పాటు బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు.

More Telugu News