Karnataka: 'ఏ క్షణంలోనైనా మృత్యువు మీ ద‌రికి చేర‌వ‌చ్చు' అంటూ క‌ర్ణాట‌క మాజీ సీఎంల స‌హా 61 మందికి బెదిరింపు లేఖ‌లు

  • బెదిరింపు లేఖ‌లు అందుకున్న వారిలో సిద్ధరామయ్య, కుమార స్వామి 
  • వారంతా దేశ ద్రోహుల‌ని లేఖ‌ల్లో పేర్కొన్న దుండ‌గులు
  • హిందూ సమాజంపై విమర్శలు చేయ‌డం స‌రికాద‌ని హెచ్చ‌రిక  
karnataka ex cms get threat letters

కర్ణాటకలో కొంద‌రు దండ‌గులు పెద్ద ఎత్తున ప్ర‌ముఖుల‌కు బెదిరింపు లేఖ‌లు పంపడం క‌ల‌క‌లం రేపింది. బెదిరింపు లేఖ‌లు అందుకున్న వారిలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య, హెచ్‌డీ కుమార స్వామి ఉండ‌డం గ‌మ‌నార్హం. వారితో పాటు 61 మంది రచయితలను చంపేస్తామంటూ దుండ‌గులు ఈ లేఖ‌లు రాశారు. వారంతా దేశ ద్రోహుల‌ని ఆ లేఖ‌ల్లో ఆరోపించారు.

ఇందుకు సంబంధించిన‌ లేఖలు సామాజిక మాధ్యమాల్లోనూ క‌న‌ప‌డుతున్నాయి. హిందూ సమాజంపై విమర్శలు చేయ‌డం స‌రికాద‌ని దుండ‌గులు ఆ లేఖ‌ల్లో పేర్కొన్నారు. ఓ వ‌ర్గానికి మ‌ద్ద‌తు తెలుపుతూ, మ‌రో వ‌ర్గంపై ఆయా ప్ర‌ముఖులు విమ‌ర్శ‌లు చేస్తున్నారని అందులో ఆరోపించారు. సిద్ధ‌రామ‌య్య‌, కుమార‌స్వామి స‌హా 61 మంది ద‌రికి ఏ క్షణంలోనైనా మృత్యువు చేర‌వ‌చ్చని దుండ‌గులు హెచ్చ‌రించారు. 

అంత్యక్రియలు చేయ‌డానికి సిద్ధంగా ఉండాల‌ని త‌మ‌ కుటుంబ సభ్యులకు ఆయా ప్ర‌ముఖులు ముంద‌స్తుగా చెప్పాల‌ని లేఖ‌ల్లో పేర్కొన్నారు. ఆ లేఖ చివరలో 'సహనం ఉన్న ఓ హిందువు' అని రాశారు. ఆ లేఖ‌ల‌పై క‌ర్ణాట‌క‌ మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి స్పందిస్తూ... ఈ విష‌యాన్ని స‌ర్కారు తీవ్రంగా పరిగణించాలని అన్నారు. 

ఈ ఘ‌ట‌న‌పై ప్రభుత్వానికి మరింత సమాచారం అందిస్తానని కుమారస్వామి చెప్పారు. అలాగే, దుండ‌గుల నుంచి బెదిరింపు లేఖలు అందుకున్న రచయితలకు కూడా వెంట‌నే భద్రత కల్పించాలని ప్ర‌భుత్వాన్ని ఆయ‌న కోరారు. తాను భ‌గ‌వంతుడిని న‌మ్ముతాన‌ని, తనకు ఎలాంటి భయాలు లేవని కుమారస్వామి చెప్పారు. అంత‌మందికి ఒకేసారి బెదిరింపుల లేఖ‌లు రావ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

More Telugu News