Indrakaran Reddy: గవర్నర్ తన పరిధిలో ఉంటే అందరూ గౌరవిస్తారు: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

  • ప్రభుత్వంపై నోరు పారేసుకోవడాన్ని గవర్నర్ మానుకోవాలన్న మంత్రి 
  • ఎవరికీ సమాచారం ఇవ్వకుండానే యాదాద్రికి వెళ్లారని వ్యాఖ్య 
  • తమిళిసై రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని సలహా 
Gov Tamilisai is behaving with partiality says Indrakaran Reddy

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు, టీఆర్ఎస్ ప్రభుత్వానికి మధ్య రోజురోజుకు అగాధం పెరుగుతోంది. తాజాగా తమిళిసైపై మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ప్రభుత్వంపై నోరు పారేసుకోవడాన్ని గవర్నర్ మానుకోవాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పట్ల గవర్నర్ వక్రబుద్ధితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం తనను అగౌరవపరిచిందని గవర్నర్ అంటున్నారని... ఎప్పుడు అవమానించారో చెప్పాలని డిమాండ్ చేశారు. 

గవర్నర్ తన పరిధిలో ఉంటే అందరూ గౌరవిస్తారని చెప్పారు. నరసింహన్ గవర్నర్ గా ఉన్నప్పుడు ప్రభుత్వానికి పూర్తిగా సహకారం అందించారని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో ఆయన భాగస్వాములు అయ్యారని చెప్పారు. ఉగాది పండుగ రోజున ఎవరికీ సమాచారం ఇవ్వకుండానే ఆమె యాదాద్రికి వెళ్లారని... 20 నిమిషాల ముందు చెపితే ప్రొటోకాల్ పాటించడం కష్టమవుతుందని ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. ఈ విషయాన్ని ఆమె గమనించాలని అన్నారు. 

తమిళిసై గతంలో తమిళనాడు బీజేపీ వ్యవహారాలు చూసుకునేవారని... ఇప్పుడు కూడా బీజేపీ నాయకురాలిగానే వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాజ్యంగబద్ధమైన గవర్నర్ హోదాలో ఉన్న ఆమె... రాజ్యాంగానికి లోబడి ప్రవర్తిస్తే బాగుంటుందని వ్యాఖ్యానించారు.

More Telugu News