Lucknow Super Giants: డికాక్ దూకుడు.. లక్నో ఖాతాలో హ్యాట్రిక్ విజయం

  • చేతిలో కావాల్సినన్ని వికెట్లున్నా ధాటిగా ఆడలేకపోయిన ఢిల్లీ
  • బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాణించిన లక్నో
  • విజయానికి బాటలు వేసిన డికాక్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు
De Kock Bats LSG to third win

ఐపీఎల్‌లో కొత్త జట్టు లక్నో సూపర్ జెయింట్స్ అంచనాలకు మించి రాణిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. గత రాత్రి ఢిల్లీ కేపిటల్స్‌తో ముంబైలోని డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో జరిగిన ఉత్కంఠ పోరులో 6 వికెట్ల తేడాతో గెలిచి వరుసగా మూడో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

 తొలుత బౌలర్లు ఢిల్లీ బ్యాటర్లను కట్టడి చేశారు. ఆపై బ్యాటర్లు స్వల్ప లక్ష్యాన్ని ఛేదించారు. డికాక్ 52 బంతుల్లోనే 9 ఫోర్లు, సిక్సర్‌తో 80 పరుగులు చేసి జట్టు విజయానికి పునాదులు వేశాడు. లక్నోకు ఇది వరసగా మూడో విజయం కాగా, ఢిల్లీకి ఇది వరుసగా రెండో ఓటమి.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 3 వికెట్లకు 149 పరుగులు సాధించింది. ఓపెనర్ పృథ్వీ షా 34 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 61 పరుగులు సాధించి ఐపీఎల్‌లో 11వ అర్ధ సెంచరీ నమోదు చేశాడు. పంత్‌ 39 (నాటౌట్‌), సర్ఫరాజ్‌ 36 (నాటౌట్‌) పరవాలేదనిపించారు. చేతిలో కావాల్సినన్ని వికెట్లు ఉన్నప్పటికీ ఢిల్లీ ఆటగాళ్లు బ్యాట్ ఝళిపించలేకపోయారు. దీనికితోడు బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 139 పరుగులు మాత్రమే చేయగలిగింది.  

స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన లక్నోకు ఓపెనర్లు రాహుల్ (24), డికాక్ శుభారంభాన్ని ఇచ్చారు. ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 73 పరుగులు జోడించారు. రాహుల్ తోడుగా డికాక్ చెలరేగిపోయాడు. రాహుల్ (24), ఎవిన్ లూయిస్ (5) అవుటైన తర్వాత డికాక్ జాగ్రత్తగా ఆడుతూనే 36 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత బ్యాట్‌కు మళ్లీ పనిచెప్పాడు. అతడి జోరు చూసి సెంచరీ ఖాయమని అనుకున్నారు. అయితే, 80 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కుల్దీప్ బౌలింగ్‌లో సర్ఫరాజ్‌ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. 

డికాక్ అవుటయ్యాక మ్యాచ్ ఉత్కంఠగా మారింది. డెత్ ఓవర్లలో పరుగులు రావడం కష్టం కావడంతో చివరి రెండు ఓవర్లలో లక్నో విజయానికి 19 పరుగులు అవసరమయ్యాయి. క్రీజులో కృనాల్ పాండ్యా ఉండడంతో 19వ ఓవర్‌లో 14 పరుగులు వచ్చాయి. దీంతో విజయం లక్నో వైపు మొగ్గింది. అయితే, 20వ ఓవర్ తొలి బంతికే హుడా (11) అవుట్ కావడంతో మళ్లీ ఉత్కంఠ పెరిగింది. క్రీజులోకి వచ్చిన బడోని (10) ఫోర్, సిక్సర్‌ బాది మరో రెండు బంతులు మిగిలి ఉండగానే జట్టుకు విజయాన్ని అందించాడు. 80 పరుగులు చేసి జట్టు విజయానికి పునాదులు వేసిన డికాక్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.

More Telugu News