Tamil Nadu: మృతదేహాన్ని ఖననం చేసిన 24 గంటల తర్వాత తిరిగొచ్చిన వ్యక్తి.. కుటుంబ సభ్యుల షాక్!

  • తమిళనాడులోని ఈరోడ్ సమీపంలో ఘటన
  • బస్టాప్‌లో శవమై కనిపించిన తండ్రి
  • ఇంటికి తీసుకొచ్చి అంత్యక్రియలు
  • విషాదంలో ఉండగానే తర్వాతి రోజు ఇంటికొచ్చిన తండ్రి
  • చనిపోయింది ఎవరన్న దానిపై పోలీసుల ఆరా
Tamil Nadu man returns home alive 24 hours after relatives buried his body

అంత్యక్రియలు నిర్వహించిన 24 గంటల తర్వాత చనిపోయిన వ్యక్తి సజీవంగా ఇంటికొచ్చి అందరినీ షాక్‌కు గురిచేశాడు. తమిళనాడులోని ఈరోడ్ సమీపంలోని బనగలద్‌పూర్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనమైంది. 

55 ఏళ్ల మూర్తి  రోజు కూలీ. చెరుకు కోసేందుకు కొన్ని రోజుల క్రితం తిరుపూర్ వెళ్లాడు. ఆదివారం సాయంత్రం మూర్తి కుమారుడు కార్తికి బంధువుల నుంచి ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఆయన తండ్రి మూర్తి సమీపంలోని బస్టాప్‌లో శవమై కనిపించాడన్నది ఆ ఫోన్ కాల్ సారాంశం. అది విన్న కార్తి వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నాడు. మృతదేహాన్ని చూసి అది తన తండ్రిదేనని నిర్ధారించాడు. 

విషయం తెలిసిన సత్యమంగళం పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందించారు. అనంతరం మృతదేహాన్ని తీసుకెళ్లిన కుటుంబ సభ్యులు ఆదివారం రాత్రి అంత్యక్రియలు నిర్వహించి మృతదేహాన్ని ఖననం చేశారు. కుటుంబ పెద్ద చనిపోయిన విషాదంలో ఉన్న కుటుంబ సభ్యులు సోమవారం సాయంత్రం ఇంటికి వచ్చిన మూర్తిని చూసి నిర్ఘాంతపోయారు.

తమ కళ్లను తాము నమ్మలేకపోయారు. అతడి కుమారుడు కార్తి అయితే షాక్ నుంచి చాలా సేపటి వరకు తేరుకోలేకపోయాడు. తన తండ్రి మరణవార్త విని ఎంత షాక్ అయ్యానో, ఆయన ఇంటికి వచ్చినప్పుడు కూడా అంతే షాక్‌కు గురయ్యానని చెప్పుకొచ్చాడు. అనంతరం ఈ సమాచారాన్ని కార్తి పోలీసులకు చేరవేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇప్పుడు చనిపోయింది ఎవరన్న దానిపై ఆరా తీస్తున్నారు.

More Telugu News