Muthu: పెంపుడు కుక్క జ్ఞాపకార్థం ఆలయం నిర్మించిన తమిళనాడు వాసి

  • శివగంగ ప్రాంతంలో ఆలయం
  • ప్రభుత్వోద్యోగిగా రిటైర్ అయిన ముత్తు
  • 2010 నుంచి ముత్తు ఇంట్లో పెరిగిన టామ్
  • 2021లో మృతి.. తల్లడిల్లిన ముత్తు కుటుంబం
Tamilnadu man built temple for his dog

కుక్కలు విశ్వాసానికి మారుపేరు. ఇవి మనిషికి అత్యంత నమ్మకమైన నేస్తాలు. కొందరు తమ పెంపుడు కుక్కలను కుటుంబ సభ్యుల్లా చూసుకుంటారు. వాటికి పుట్టినరోజులు జరపడం, సీమంతాలు చేయడం, బారసాలలు నిర్వహించడం కూడా మీడియాలో కనిపిస్తుంటుంది. అయితే, ఎంతో అనుబంధం పెనవేసుకున్న పెంపుడు కుక్కలు దూరమైతే కొందరు తట్టుకోలేరు. 

తమిళనాడుకు చెందిన 82 ఏళ్ల ముత్తు కూడా తన పెంపుడు శునకం మరణాన్ని భరించలేకపోయారు. ముత్తు ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన శివగంగ ప్రాంతంలోని మానమదురైలో నివసిస్తున్నారు. తన పట్ల ఎంతో ప్రేమగా ఉండే టామ్ అనే కుక్కతో ఆయన ఎంతో అనుబంధం పెంచుకున్నారు. 2010 నుంచి ఆ కుక్క ముత్తు కుటుంబంతో పాటే ఉండేది. దాన్ని ముత్తు ఓ పసిబిడ్డలా పెంచారు. 

అయితే, అనారోగ్య సమస్యలు తలెత్తడంతో 2021లో టామ్ మరణించింది. దాంతో, ఆయన తల్లడిల్లిపోయారు. ఈ క్రమంలో ముత్తు తన పెంపుడు కుక్కకు ఆలయం నిర్మించారు. అందులో టామ్ ప్రతిమను ప్రతిష్టించారు. అందుకోసం రూ.80 వేలు ఖర్చయింది. పండుగ దినాల్లోనూ, ప్రతి శుక్రవారం నాడు ఆ ఆలయంలో ముత్తు కుటుంబీకులు పూజలు నిర్వహిస్తుంటారు. శివగంగ ప్రాంతంలో ఈ ఆలయం ఎంతో ప్రాచుర్యం పొందింది. అక్కడికి వచ్చినవాళ్లు దీన్ని ఆసక్తిగా తిలకిస్తుంటారు.

More Telugu News