Renuka Chowdary: ఆ పబ్ నా కూతురుది అంటున్నారు: తీవ్రంగా స్పందించిన రేణుకా చౌదరి

  • గతరాత్రి పుడింగ్ అండ్ మింక్ పబ్ పై దాడులు
  • అనేకమందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • ఆ పబ్ రేణుకా చౌదరి కుమార్తెదంటూ ప్రచారం
  • ఓ ప్రకటనలో ఖండించిన రేణుకా చౌదరి
Renuka Chowdary on Pudding and Mink pub issue

హైదరాబాదులోని పుడింగ్ మింక్ పబ్ పేరు ఇప్పుడు మీడియాలో ప్రముఖంగా వినిపిస్తోంది. గతరాత్రి ఆ పబ్ పై దాడి చేసిన పోలీసులు డ్రగ్స్ ను స్వాధీనం చేసుకోవడం పాటు, అనేకమందిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాగా, ఆ పబ్ కాంగ్రెస్ నాయకురాలు, మాజీ ఎంపీ రేణుకా చౌదరి కుమార్తె తేజస్విని చౌదరిదంటూ ప్రచారం జరిగింది. దీనిపై రేణుకా చౌదరి ఓ ప్రకటన చేశారు. 

"పోలీసులు హైదరాబాదు రాడిసన్ బ్లూ హోటల్ లో ఉన్న ఫుడింగ్ అండ్ మింక్ బార్ పై దాడులు జరిపారు. అయితే, మీడియాలోని కొన్ని వర్గాలు ఆ పబ్ మా అమ్మాయి తేజస్విని చౌదరిదని పేర్కొన్నాయి. అంతేకాదు, పోలీసులు ఆమెను నిర్బంధించారని, ప్రశ్నిస్తున్నారని కూడా ఆ మీడియా వర్గాలు ప్రచారం చేశాయి. దీంట్లో ఒక్కటి కూడా నిజం కాదు. ఫుడింగ్ అండ్ మింక్ పబ్ కు మా అమ్మాయి యజమాని కాదు. అసలా పబ్ మేనేజ్ మెంట్ కార్యకలాపాలతో మా అమ్మాయికి ఎలాంటి సంబంధం లేదు. 

పైగా, పోలీసులు దాడులు చేసిన ఏప్రిల్ 2వ తేదీన మా అమ్మాయి ఆ పబ్ లో లేనేలేదు. అలాంటప్పుడు ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకోవడం, ప్రశ్నించడం జరగని పని. ఈ సందర్భంగా నేను మీడియా సంస్థలను కోరేదేమిటంటే... కనీస పాత్రికేయ విలువలు పాటించండి. వార్తలు ప్రసారం చేసేముందు ఓసారి వాస్తవాలు నిర్ధారించుకోండి. మీ సంచలనాత్మక కథనాల కోసం ప్రైవేటు వ్యక్తుల పేర్లను బయటికి లాగే ప్రయత్నం చేయొద్దు" అంటూ రేణుకా చౌదరి హితవు పలికారు.

More Telugu News