Crime News: హోట‌ల్ భ‌వనం పై నుంచి కుమార్తెతో క‌లిసి దూకిన వ్య‌క్తి.. ఇద్ద‌రూ మృతి

  • యాదగిరిగుట్టలో విషాద ఘ‌ట‌న
  • కుటుంబ క‌ల‌హాల‌తో ఆత్మ‌హ‌త్య‌
  • కుమార్తెను త‌న భార్య స‌రిగ్గా చూసుకోద‌ని ఆత్మ‌హ‌త్య లేఖ‌
  • మృతుల‌ను చెరుకూరి సురేశ్(40), శ్రేష్ఠ‌(6)గా గుర్తింపు
man commits suicide along with daughter

యాదగిరిగుట్టలో విషాద ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఓ వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌ని భావించాడు. అయితే, తాను చ‌నిపోతే త‌న కుమార్తెను తన భార్య స‌రిగ్గా చూసుకోద‌ని అనుకున్నాడు. దీంతో ఆరేళ్ల కూతురితో క‌లిసి భ‌వ‌నంపై నుంచి దూకి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ ఘ‌ట‌న యాదగిరిగుట్టలోని ఓ హోట‌ల్‌ వ‌ద్ద చోటు చేసుకుంది.

తండ్రీకుమార్తెలు తీవ్ర‌ గాయాల‌తో హోట‌ల్‌ భ‌వనం వ‌ద్ద క‌న‌ప‌డడంతో గమనించిన హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారిద్ద‌రినీ పోలీసులు ఆసుప‌త్రికి త‌ర‌లించ‌గా తండ్రీకుమార్తెలిద్దరూ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతులు చెరుకూరి సురేశ్(40), ఆయ‌న కూతురు శ్రేష్ఠ‌(6)గా పోలీసులు గుర్తించారు.

హైదరాబాద్ లోని బీఎస్‌ఎన్‌ఎల్‌లో సురేశ్ ఉద్యోగి అని పోలీసులు చెప్పారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించ‌గా ఘటనాస్థలిలో సూసైడ్ నోట్ దొరికింది. అందులో సురేశ్ ప‌లు విష‌యాలు పేర్కొన్నాడు. త‌న‌ కుటుంబంతో తాను సంతోషంగా లేనని, కుటుంబ కలహాల వల్లే తాను ఆత్మ‌హ‌త్య చేసుకుందామ‌నుకున్నాన‌ని తెలిపాడు. 

అయితే, తాను చనిపోతే త‌న‌ పంచప్రాణాలయిన త‌న‌ బంగారు తల్లి, కూతురు శ్రేష్ఠ ఒంటరిదైపోతుందని ఆందోళ‌న చెందాన‌ని వివ‌రించాడు. త‌న కూతురిని త‌న‌ భార్య‌ సరిగ్గా చూసుకోదని, తాను చ‌నిపోతే కుమార్తె శ్రేష్ఠ‌ చాలా కష్టాలు పడాల్సి వస్తుందని అన్నాడు. అందుకే త‌న కుమార్తెను కూడా త‌న‌తో పాటే తీసుకువెళ్తున్నానంటూ ఆయ‌న ఆత్మ‌హ‌త్య లేఖ‌లో పేర్కొన్నాడు. కాగా, తండ్రీకుమార్తెల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి త‌ర‌లించారు. ఆత్మ‌హ‌త్య‌కు గ‌ల కార‌ణాల‌పై పూర్తి వివ‌రాలు సేక‌రించే ప‌నిలో ఉన్నారు.

More Telugu News