bus: యాదాద్రికి ప్ర‌త్యేక బ‌స్సులు: ఆర్టీసీ ఎండీ సజ్జనార్

  • ప్రతి జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్ శివారు ఉప్పల్ సర్కిల్ వ‌ద్ద‌కు బ‌స్సులు 
  • అక్క‌డి నుంచి యాదాద్రికి మినీ బస్సులు 
  • జేబీఎస్ నుంచి యాదాద్రికి  రూ.100 చార్జ్‌ 
  • ఉప్పల్ నుంచి రూ.75
  • మొత్తం 100 మినీ బ‌స్సుల సౌక‌ర్యం
sajjanar on yadadri buses

అత్యద్భుతంగా పునర్నిర్మాణమైన యాదాద్రి ఆలయంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి స్వయంభూ దర్శనాలు మ‌ళ్లీ మొద‌లైన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో యాదాద్రికి భ‌క్తుల తాకిడి భారీగా పెరిగే అవ‌కాశం ఉండ‌డంతో అందుకు త‌గ్గ ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. యాదాద్రికి ప్ర‌త్యేక బ‌స్సు స‌ర్వీసులు న‌డుపుతున్న‌ట్లు, 100 మినీ బస్సులు అందుబాటులో ఉన్నట్టు టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. 

ప్రతి జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్ శివారులోని ఉప్పల్ సర్కిల్ వ‌ద్ద‌కు బ‌స్సులు నడుస్తాయని, అక్కడి నుంచి మినీ బ‌స్సుల్లో యాదాద్రికి వెళ్ల‌వ‌చ్చ‌ని చెప్పారు. అలాగే, జేబీఎస్ నుంచి యాదాద్రికి రూ.100, ఉప్పల్ నుంచి రూ.75 ఛార్జ్ ఉంటుంద‌ని తెలిపారు. ప్రైవేట్ వాహనాల కంటే ఆర్టీసీ బస్సుల్లోనే ప్ర‌యాణికులు సౌక‌ర్యవంతంగా యాదాద్రి చేరుకోవ‌చ్చ‌ని అన్నారు. 

కాగా, శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయానికి తూర్పు దిశలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన 13 ప్రసాదం కౌంటర్ల భవనం నిన్న ప్రారంభ‌మైంది. నిన్న‌ ప్రసాదాల విక్ర‌యాల ద్వారా ఆలయానికి రూ.8,17,580 ఆదాయం వచ్చింది.

More Telugu News