Sako: భారత సైనికులకు ఫిన్లాండ్ నుంచి అధునాతన 'సాకో' రైఫిళ్లు

  • ఎల్ఓసీ వద్ద పాక్ స్నైపర్ల కార్యకలాపాలు
  • ప్రత్యర్థిపై ఆధిక్యత కోసం సాకో 338 టీఆర్ జీ-42 స్నైపర్ రైఫిళ్లు
  • ఒకటిన్నర కిలోమీటరు దూరంలోని లక్ష్యాన్ని ఛేదించే సాకో
Finland made Sako sniper rifles for Indian soldiers

ప్రపంచంలో ఇప్పుడున్న ఆయుధాల్లో అత్యంత నమ్మకమైనదిగా సాకో 338 టీఆర్ జీ-42 స్నైపర్ రైఫిల్ కు గుర్తింపు ఉంది. ఈ అధునాతన స్నైపర్ గన్ ను ఫిన్లాండ్ తయారు చేస్తోంది. తాజాగా, ఈ సాకో రైఫిళ్లను భారత సైన్యం కొనుగోలు చేసింది. జమ్మూ కశ్మీర్ సరిహద్దులో ఉగ్రవాదులు, చొరబాటుదారుల అంతు చూసేందుకు విధులు నిర్వర్తిస్తున్న భారత జవాన్లకు ఈ ప్రత్యేకమైన స్నైపర్ రైఫిళ్లను అందించారు.

సరిహద్దులకు ఆవల నుంచి పాకిస్థాన్ కూడా స్నైపర్లను మోహరిస్తుండడంతో ఎల్ఓసీ వద్ద విధులు నిర్వర్తిస్తున్న భారత జవాన్లకు ప్రమాదం పొంచి ఉందని రక్షణశాఖ గుర్తించింది. దాంతో, మనవాళ్లకు కూడా స్నైపర్ రైఫిళ్లను ఇవ్వాలన్న కార్యాచరణలో భాగంగానే ఫిన్లాండ్ నుంచి పెద్ద ఎత్తున సాకో 338 టీఆర్ జీ-42 తుపాకులను కొనుగోలు చేసింది. 

సాకో స్నైపర్ రైఫిల్ తో ఒకటిన్నర కిలోమీటరు దూరంలో ఉన్న లక్ష్యాన్ని కూడా గురితప్పకుండా ఛేదించవచ్చు. ఈ తుపాకీ బరువు 6.55 కిలోలు. దీంట్లో 'లాపువా మ్యాగ్నమ్' అనే పవర్ ఫుల్ తూటాలు వాడతారు. ఎల్ఓసీ వద్ద పాక్ స్నైపర్ల నుంచి సవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో, సాకో తుపాకులు భారత జవాన్లకు ఆధిక్యతను అందిస్తాయని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
.

More Telugu News