KCR: యాదాద్రి చేరుకున్న కేసీఆర్ దంప‌తులు.. శ్రీలక్ష్మీనరసింహస్వామి శోభాయాత్ర ప్రారంభం

  • స్వయంభూ దర్శన ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేసీఆర్
  • శోభాయాత్ర‌లో పాల్గొన్న‌ కేసీఆర్‌, మంత్రులు, వేదపండితులు 
  • కాసేప‌ట్లో గర్భాలయంలో కేసీఆర్‌ తొలి పూజ
kcr reaches yadadri

తెలంగాణ‌ సీఎం కేసీఆర్ దంపతులు యాదాద్రి చేరుకున్నారు. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి స్వయంభూ దర్శన ప్రారంభోత్సవ కార్యక్రమంలో వారు పాల్గొన‌నున్నారు. అలాగే, తెలంగాణ‌ మంత్రులు హ‌రీశ్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, మల్లారెడ్డి, జగదీశ్‌ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, తదితరులు కూడా యాదాద్రి చేరుకున్నారు. శ్రీలక్ష్మీనరసింహస్వామి శోభాయాత్ర బాలాలయం నుంచి ప్రారంభమైంది. కేసీఆర్‌తో పాటు మంత్రులు, అర్చకులు, వేదపండితులు పాల్గొన్నారు.

ఉదయం 11.55 గంటలకు మహాకుంభ సంప్రోక్షణ ప్రారంభం కానుంది. అనంత‌రం గర్భాలయంలో సీఎం కేసీఆర్‌ తొలి పూజ చేస్తారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో భాగస్వాములైన వారిని ఉత్తర రాజగోపురం ఎదురుగా ఏర్పాటు చేసిన వేదిక వద్ద కేసీఆర్ సన్మానిస్తారు. ఆ త‌ర్వాత యాగశాల స్థలం వద్ద మధ్యాహ్న భోజనాలు చేస్తారు.

దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత స్వయంభు స్వామివారు గర్భాలయంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ నెల 21న ప్రధానాలయ ఉద్ఘాటన క్రతువుకు శ్రీకారం చుట్టిన విష‌యం తెలిసిందే. అష్టభుజి ప్రాకార మండపాలు, సింహయాళీ, కాకతీయ స్తంభాలు, పురాణ ఇతిహాసాలను రాతి శిలలపై పదిలపరుస్తూ ఎన్నో విశేషాలతో పాంచనరసింహుల పునర్నిర్మాణం, విస్తరణ పూర్త‌యింది.

More Telugu News