Vizag: జ‌గ‌న్‌, సాయిరెడ్డి, రోజా మాస్కుల‌తో విశాఖ మ‌హిళ‌ల వినూత్న నిర‌స‌న‌

  • వైసీపీ తీరును నిర‌సిస్తూ విశాఖ మ‌హిళ‌ల నిర‌స‌న‌
  • ముఖాల‌కు వైసీపీ నేత‌ల మాస్కుల‌తో స్కిట్‌
  • జ‌గ‌న్‌కు హార‌తి ప‌డుతూ, పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తుతూ ప్ర‌ద‌ర్శ‌న‌
vizag women protest on ysrcp ruling

ఏపీలో నాటు సారా మ‌ర‌ణాలు, వాటిపై అసెంబ్లీలో జ‌రుగుతున్న ప‌రిణామాలు, క‌ల్తీ మ‌ద్యంపై వైసీపీ స‌ర్కారు చేస్తున్న వాద‌న‌లు, క‌ల్తీ మ‌ద్యం కార‌ణంగా జ‌రుగుతున్న మ‌ర‌ణాలు.. త‌దిత‌ర అంశాల‌పై నిర‌స‌న తెలిపేందుకు విశాఖకు చెందిన మ‌హిళ‌లు ఏకంగా ఓ స్కిట్‌నే రూపొందించి ప్ర‌ద‌ర్శించారు. నిర‌స‌న‌లో భాగంగా జ‌గ‌న్ మాస్కుతో ఓ పురుషుడు కుర్చీలో కూర్చుని ఉండ‌గా.. వైసీపీ నేత‌లు విజ‌య‌సాయిరెడ్డి, రోజా మాస్కులు ధ‌రించిన ఇద్ద‌రు మ‌హిళ‌లు జ‌గ‌న్‌ను కీర్తిస్తూ, హార‌తి ప‌డుతూ న‌టించిన తీరు ఈ స్కిట్‌కు హైలెట్‌గా నిలిచింది. 

జ‌గ‌న‌న్న మ‌ద్యం ప‌థ‌కానికి ఇంకెంద‌రి మ‌హిళ‌ల తాళిబొట్టు తెగాలి? అన్న క్యాప్ష‌న్‌తో విశాఖ మ‌హిళ‌లు ఈ నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌ను చేప‌ట్టారు. జంగారెడ్డిగూడెంలో నాటు సారా కార‌ణంగా 25 మంది చ‌నిపోతే జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఇప్ప‌టిదాకా స్పందించ‌లేద‌ని, ఈ వ్య‌వ‌హారంపై జ‌గ‌న్ స‌ర్కారు అసెంబ్లీలో వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు బాగోలేద‌ని ఈ సంద‌ర్భంగా మ‌హిళ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అధిక ధ‌ర‌ల‌కు మ‌ద్యం, క‌ల్తీ మ‌ద్యం, నాటు సారా వంటి వాటిని త‌క్ష‌ణ‌మే నిర్మూలించాల‌ని మ‌హిళ‌లు డిమాండ్ చేశారు.

More Telugu News