bangladesh: భారత జట్టు విశ్వరూపం.. కుప్పకూలిన బంగ్లాదేశ్ జట్టు

  • 110 పరుగుల తేడాతో ఘన విజయం
  • 50 పరుగులతో రాణించిన యస్తిక భాటియా
  • భారత బౌలింగ్ కి బంగ్లా జట్టు విలవిల 
  • 119 పరుగులకు ఆల్ అవుట్
wOMENS WORLD CUP India grand win on bangladesh

మహిళల ప్రపంచకప్ లో భారత జట్టు తన ప్రత్యర్థి బంగ్లాదేశ్ జట్టును మట్టి కరిపించింది. లీగ్ దశలో కీలక మ్యాచ్ కావడంతో భారత జట్టు అంతే మెరుగ్గా ఆడింది. బ్యాటింగ్, బౌలింగ్ లోనూ రాణించి బంగ్లాదేశ్ పై 110 పరుగుల తేడాతో చక్కటి విజయాన్ని సొంతం చేసుకుంది. 


టాస్ గెలిచిన భారత మహిళల జట్టు ముందు బ్యాటింగ్ తీసుకుంది. యస్తిక భాటియా మరోసారి రాణించి 50 పరుగులు సాధించగా.. ఓపెనర్లు స్మృతి మందన 30, షఫాలి వర్మ 42 పరుగులు రాబట్టారు. వీరికి పూజ వస్త్రాకర్, స్నేహ్ రాణా మద్దతుగా నిలవడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లను కోల్పోయి 229 పరుగులు సాధించింది. రితుమోని కూడా రాణించి మూడు వికెట్లు తీసింది. నహీదా అక్తర్ 2 వికెట్లు తీసింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా యస్తిక భాటియా ఎంపికైంది.

అనంతరం 230 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ జట్టును భారత బౌలర్లు కట్టి పడేశారు. బంగ్లాదేశ్ బ్యాట్స్ మెన్ వెన్ను విరిచేలా స్నేహ్ రాణా బౌలింగ్ తో విరుచుకుపడింది. పూజ వస్త్రాకర్, జులాన్ గోస్వామి సైతం 2 వికెట్ల చొప్పున పడగొట్టారు. భారత బౌలింగ్ దాడికి బంగ్లాదేశ్ జట్టు సభ్యులు ఒక్కొక్కరుగా వెనుదిరిగారు. సల్మాన్ ఖాటున్ 32 పరుగులు ఒక్కటే జట్టులో అత్యధిక స్కోరు చేయడం పరిస్థితిని తెలియజేస్తోంది. 40.3 ఓవర్లకే 119 పరుగులకు ఆల్ అవుట్ అయింది. 

పాయింట్ల పట్టికలో ఆరు మ్యాచుల్లో మూడు విజయాలతో భారత్ 6 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా 12 పాయింట్లు, దక్షిణాఫ్రికా 8 పాయింట్లతో ముందున్నాయి. 

More Telugu News