Miss World: హైదరాబాద్ అమ్మాయిని వరించని అదృష్టం.. మిస్ వరల్డ్ గా పోలెండ్ అందాల భామ!

  • పోర్టోరికోలో ప్రపంచ అందాల పోటీలు
  • డిసెంబర్ లోనే జరగాల్సి ఉన్నా కరోనాతో వాయిదా
  • కిరీటం దక్కించుకున్న కరోలీనా బీలాస్కా
  • ఫస్ట్ రన్నరప్ గా ఇండియన్ అమెరికన్
  • మానస వారణాసికి ‘టాప్ 13’తోనే సరి
Pland Beauty Crowned Miss World 2021

మిస్ వరల్డ్ 2021 కిరీటాన్ని  పోలెండ్ అందాల భామ కరోలీనా బీలాస్కా సొంతం చేసుకుంది. పోర్టోరికోలోని శాన్ జువాన్ కోకా కోలా మ్యూజిక్ హాల్ లో జరిగిన ప్రపంచ అందాల పోటీల్లో ఆమెనే న్యాయ నిర్ణేతలు విజేతగా ప్రకటించారు. అమెరికాకు చెందిన భారతీయ సంతతి ముద్దుగుమ్మ శ్రీసైని ఫస్ట్ రన్నరప్ గా నిలిచింది. కోట్ ది ఐవరీకి చెందిన ఒలీవియా యేస్ సెకండ్ రన్నరప్ గా నిలిచింది. 

ప్రస్తుతం తాను మేనేజ్ మెంట్ లో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నానని, అందులోనే పీహెచ్ డీ చేస్తానని, దాంతో పాటే మోడల్ గానూ కొనసాగుతానని కరోలీనా చెప్పింది. తాను మోటివేషనల్ స్పీకర్ కావాలనుకుంటున్నానని తెలిపింది. మాజీ మిస్ వరల్డ్ టోనీ యాన్ సింగ్ నుంచి కిరీటం తీసుకున్న వెంటనే.. ఆమె భావోద్వేగానికి లోనైంది. ఈ నిజాన్ని తానిప్పటికీ నమ్మలేకపోతున్నానని చెప్పింది. ఈ ఘట్టాన్ని తాను జీవితాంతం గుర్తుంచుకుంటానని తెలిపింది. 

కాగా, నిలువ నీడలేని అభాగ్యుల కోసం ఆమె ‘జూపా నా పియట్రినై’ అనే స్వచ్ఛంద సంస్థను నడుపుతోంది. సమాజంలోని అసమానతలపైనా పోరాడుతోంది. అంటరానితనంపై పోరాటాన్ని సాగిస్తోంది. ప్రతి ఆదివారం అన్యాయాన్ని ఎదుర్కొంటున్న వాళ్లకు న్యాయసాయం చేస్తోంది. వారికి ఆహారం, వస్త్రాల వంటి వాటిని పంపిణీ చేస్తోంది. కరోనా వ్యాక్సిన్ కోసం నమోదు చేసుకోలేని వాళ్లందరికీ.. ప్రభుత్వంతో మాట్లాడి వ్యాక్సిన్ వేయించింది. 

ఇక మిస్ వరల్డ్ పోటీలకు 40 మంది సెమీ ఫైనల్ కు వచ్చారు. వాస్తవానికి గత ఏడాది డిసెంబర్ లోనే ఫైనల్స్ ను నిర్వహించాల్సి ఉన్నా కరోనా కారణంగా వాయిదా వేశారు. ప్రపంచవ్యాప్తంగా 100 దేశాలకు చెందిన అందాల భామలు మిస్ వరల్డ్ పోటీల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కాగా, ఫైనల్స్ సందర్భంగా మాజీ మిస్ వరల్డ్ టోనీ యాన్ సింగ్.. ఉక్రెయిన్ కు సంఘీభావంగా గీతాన్ని ఆలపించింది. 

భారత్ తరఫున హైదరాబాద్ అమ్మాయి మానస వారణాసి పోటీ పడినా ఆమెను అదృష్టం వరించలేదు. టాప్ 13కు మాత్రమే తను పరిమితమైంది. చివరిసారిగా భారత్ కు 2017లో మిస్ వరల్డ్ కిరీటం దక్కింది. మానుషి చిల్లార్ అప్పుడు మిస్ వరల్డ్ గా గెలిచింది. 

More Telugu News