Asaduddin Owaisi: కర్ణాటక హైకోర్టు తీర్పుపై అసదుద్దీన్ ఒవైసీ అసంతృప్తి.. పాయింట్ల వారీగా తీర్పును ఖండించిన హైదరాబాద్ ఎంపీ!

  • ‘విభేదించే హక్కు’తో తీర్పును ఖండిస్తున్నా
  • హిజాబ్ ను కట్టుకోవడమూ దైవారాధనే
  • బ్రాహ్మణులకు జంద్యం ఎలానో ఇదీ అలాగేనంటూ కామెంట్
I Disagree With Karnataka High Court Verdict Says Asaduddin

హిజాబ్ మత ఆచారం కాదని, విద్యాసంస్థలకు విద్యార్థులంతా యూనిఫాంలోనే రావాలన్న హైకోర్టు తీర్పుపై హైదరాబాద్ ఎంపీ, మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ సహా పలువురు ప్రముఖులు విమర్శనాస్త్రాలు సంధించారు. అసదుద్దీన్ 14 పాయింట్లతో హైకోర్టు తీర్పును ఖండించారు. కోర్టు తీర్పుపై స్పందన ఆయన మాటల్లోనే...

1. హిజాబ్ పై నేను కర్ణాటక హైకోర్టును తీర్పుతో విభేదిస్తున్నా. నాకు రాజ్యాంగం కల్పించిన ‘విభేదించే హక్కు’ ద్వారా తీర్పును ఖండిస్తున్నా. పిటిషనర్లు సుప్రీంకోర్టులో తీర్పును సవాల్ చేస్తారని ఆశిస్తున్నా. 
2. ముస్లిం పర్సనల్ లా బోర్డ్ తో పాటు ఇతర ముస్లిం సంస్థలూ తీర్పును అప్పీల్ చేయాలని కోరుతున్నా. ఈ తీర్పు మత స్వేచ్ఛ, సాంస్కృతిక స్వేచ్ఛను హరిస్తోంది. 
3. ఆలోచన స్వేచ్ఛ, భావప్రకటన స్వేచ్ఛ, విశ్వాసం, పూజించే స్వేచ్ఛను రాజ్యాంగ పీఠిక కల్పిస్తోంది. కాబట్టి తలకు హిజాబ్ చుట్టుకోవడం మతపరమైన స్వేచ్ఛ అని భావిస్తున్నా. ఓ ముస్లింగా హిజాబ్ ను కట్టుకోవడమూ దైవారాధన వంటిదే. 
4. మత ఆచార స్వేచ్ఛను ఇప్పటికైనా సమీక్షించాల్సిన సమయం వచ్చింది. ముస్లిం మతాన్ని ఆచరించే వ్యక్తిగా మతంలోని ప్రతి ఒక్కటి అవసరమే. దేవుడిని నమ్మని వారికి అవసరం లేదు. బ్రాహ్మణులకు జంద్యం ఎంతో ముఖ్యం. కానీ, వేరే వాళ్లకు కాదు. కాబట్టి ఏది అవసరమన్నది జడ్జిలు నిర్ణయించడం విచిత్రం. 
5. ఒకే మతంలోని వేరే వ్యక్తులూ ఏది అవసరమో.. ఏది కాదో చెప్పేందుకు అనర్హులు. అది ఓ వ్యక్తి, దేవుడికి సంబంధించిన వ్యవహారం. ఇలాంటివి ఇతరుల స్వేచ్ఛకు భంగం కలిగించినప్పుడు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి తలకు చుట్టుకునే హిజాబ్ తో ఎదుటి వారికి ఎలాంటి సమస్య ఉండదనే అనుకుంటున్నా. 
6. హిజాబ్ ను నిషేధించడమంటే ముస్లిం మహిళలు, వారి కుటుంబాల గౌరవాన్ని దెబ్బతీసేదే. దాని వల్ల వారి విద్యకు విఘాతం కలిగే ప్రమాదముంటుంది. 
7. యూనిఫాంతో అందరిలో ఐక్యత పెరుగుతుందన్న కారణంతో హిజాబ్ ను వద్దంటున్నారు. మరి, యూనిఫాంతో ఐక్యత ఎలా పెరుగుతుంది? ఎవరు పెద్దింటి నుంచి వచ్చారు? ఎవరు పేదింటి నుంచి వచ్చారు? అన్న విషయాలు విద్యార్థులకు తెలియదా? పేర్ల వెనుక కులం వారి హోదాను తెలపదా?
8. టీచర్లు వివక్ష చూపించకుండా యూనిఫాం ఎలా అడ్డుకుంటుంది? ప్రపంచవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు, పోలీసులు, ఆర్మీ యూనిఫాంలలో వైవిధ్యత ఉండేందుకు సహేతుకమైన మార్పులను చేయడంలేదా? 
9. హిజాబ్, సిక్కుల తలపాగా కోసం ఐర్లాండ్ ప్రభుత్వం ఇటీవలే పోలీస్ శాఖలో నిబంధనలను మార్చింది. వాటిని మోదీ ప్రభుత్వం స్వాగతించలేదా? ఇంట్లో ఒకలాగా, విదేశాల్లో మరోలాగా ప్రవర్తించడం దేనికి? హిజాబ్ లేదా పాగాలను యూనిఫాం రంగులో ఉంటే అనుమతించవచ్చును. 
10. సమస్యలేని చోట ఇప్పుడు ప్రభుత్వం ఓ సమస్యను సృష్టించింది. పిల్లలు హిజాబ్, గాజులు వేసుకునే స్కూలుకు వెళ్తున్నారు. వివాదం లేని చోట కాషాయ టర్బన్లు కట్టుకుని వచ్చి పెద్ద వివాదంగా మార్చారు. 
11. నిజంగా కాషాయ కండువాలు, పాగాలు అవసరమా? లేదంటే హిజాబ్ కు పోటీగా కట్టుకుని వచ్చారా? ప్రాథమిక హక్కులను కాలరాసేలా ప్రభుత్వ జీవో, హైకోర్టు తీర్పులున్నాయి. మీడియా, పోలీసులు, ఇతర పాలక వర్గాలు హిజాబ్ వేసుకున్న వారిని వేధిస్తున్నాయి. విద్యార్థులు, టీచర్లపైనా వేధింపులున్నాయి. పరీక్షలు రాయకుండా విద్యార్థులను అడ్డుకున్నారు. పౌర హక్కులను కాలరాయడమే. 
12. కేవలం ఒక మతాన్ని లక్ష్యంగా చేసుకుని, వారి మత ఆచారాలను నిషేధించారు. మతపర వివక్షను రాజ్యాంగంలోని 15వ అధికరణం నిషేధిస్తోంది. ఈ తీర్పు.. ఆ ఆర్టికల్ ను ధిక్కరించడం కాదా? అల్లా ఆదేశాలు, చదువు.. రెండింట్లో ఏది కావాలో తేల్చుకోవాలంటూ హైకోర్టు తీర్పు చెప్పింది. 
13. అల్లా నియమాల ప్రకారం చదువుకోవడం ఎంత ముఖ్యమో.. ఆయన పెట్టిన నియామాల్లోని సలా, హిజాబ్, రోజా వంటి వాటిని ఆచరించడమూ ముఖ్యమే. తీర్పు ప్రకారం మసీదులు, ముస్లింలు గడ్డం పెంచడం, మహిళలు హిజాబ్ వేసుకోవడం అవసరం కాదని న్యాయస్థానాలు ఎలా నిర్ణయిస్తాయి? భావస్వేచ్ఛ, విశ్వాసాలింకా ఏం మిగిలాయి?
14. ఈ తీర్పు ఆధారంగా మహిళలు హిజాబ్ ధరించకుండా వేధించడాన్ని చట్టబద్ధం చేయడం సరికాదు. ఇదే జరిగితే బ్యాంకులు, ఆసుపత్రులు, ప్రజా రవాణా వ్యవస్థలకూ అది పాకుతుంది. 
15. ఈ పాయింట్లన్నీ కోర్టు ఇచ్చిన మౌఖిక తీర్పు ఆధారంగా నేను ప్రశ్నిస్తున్నవే. తీర్పు కాపీ వచ్చాక మరింత వివరంగా దానిపై స్పందిస్తా. 

కాగా, కర్ణాటక హైకోర్టు తీర్పుపై జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఒమర్ అబ్దుల్లా స్పందిస్తూ, తీర్పును ఖండించారు. ‘‘ఓ పక్క మహిళా సాధికారత గురించి మాట్లాడుతూనే.. మరోపక్క వారి చిన్నచిన్న కోరికలనూ తోసిపుచ్చుతున్నాం. వాళ్ల చాయిస్ ను వద్దంటున్నాం. ఇది మతస్వేచ్ఛనే కాదు.. ఏం కావాలో కోరుకునే స్వేచ్ఛనూ తీర్పు హరిస్తోంది’’ అని ముఫ్తీ ట్వీట్ చేశారు. 

‘‘హిజాబ్ అంటే వేసుకునే దుస్తుల్లో ఓ ముక్క కాదు. మీరేమనుకుంటున్నారో నాకైతే తెలియదు. ఎలాంటి దుస్తులు ధరించాలో ఓ మహిళ ఎంపిక చేసుకునే హక్కు. ఆ మూల హక్కునే హైకోర్టు తీర్పు హరించింది. కర్ణాటక హైకోర్టు తీర్పు అసంతృప్తి పరిచింది’’ అని ఒమర్ అబ్దుల్లా ట్వీట్ లో అసహనం వ్యక్తం చేశారు.

More Telugu News