Election Results: గెలిపించు దేవుడా.. ఆలయాలకు క్యూ కట్టిన ముఖ్యమంత్రులు, ప్రముఖులు.. ఫొటోలు ఇవిగో

  • గురుసాగర్ మస్తానా సాహిబ్ గురుద్వారాలో భగవంత్ మన్ ప్రార్థనలు
  • చామ్ కౌర్ సాహిబ్ లో చరణ్ జిత్ సింగ్ చన్నీ ప్రార్థనలు
  • ఇంఫాల్ గోవిందాజీ ఆలయంలో మణిపూర్ సీఎం పూజలు
  • శ్రీదత్తా మందిర్ కు వెళ్లిన గోవా ముఖ్యమంత్రి 
CMs Queued To Temples in the wake of Election Results

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ప్రముఖ నేతలు ఆలయాలకు క్యూ కట్టారు. ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వారి ప్రత్యర్థులంతా గుళ్లకు వెళ్లి గెలుపు కోసం పూజలు చేశారు.   

పంజాబ్ ఆప్ సీఎం అభ్యర్థి భగవంత్ మన్ సంగ్రూర్ లోని గురుసాగర్ మస్తానా సాహిబ్ గురుద్వారాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రస్తుతం ఆయన లీడింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. పంజాబ్ మొత్తాన్ని ఆప్ స్వీప్ చేస్తోంది. 
 
హెయింగాంగ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మణిపూర్ సీఎం ఎన్. బిరేన్ సింగ్ .. ఇంఫాల్ లోని శ్రీ గోవిందాజీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. బీజేపీని మళ్లీ అధికారంలోకి తేవాలంటూ మొక్కుకున్నట్టు చెప్పారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో నెలకొన్న శాంతి సామరస్యాలకు వచ్చే ఐదేళ్లు చాలా కీలకమని, కాబట్టి బీజేపీని మళ్లీ అధికారంలోకి వచ్చేలా చూడాలంటూ దేవుడిని మొక్కుకున్నానని చెప్పారు. 

చామ్ కౌర్ సాహిబ్ లోని గురుద్వారాలో పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ ప్రార్థనలు చేశారు. తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్నారు. శంఖాలీలోని శ్రీదత్తా మందిర్ లో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ పూజలు చేశారు. బీజేపీ నేత రాజేశ్వర్ సింగ్ చంద్రికా దేవి ఆలయంలో పూజలు చేశారు. యూపీలో ప్రధాని మోదీ, సీఎం యోగిలపై ప్రజలు మంచి నమ్మకం పెట్టుకున్నారని, బీజేపీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన చెప్పారు. సరోజినీ నగర్ లో లక్ష ఓట్లతో గెలుస్తామన్నారు.

More Telugu News