Narendra Modi: ఐదు రాష్ట్రాల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే గుజరాత్ కు వెళ్లనున్న మోదీ

  • రేపు ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్
  • 11న గుజరాత్ కు వెళ్లనున్న మోదీ
  • రెండు రోజుల పాటు స్వరాష్ట్రంలో పర్యటించనున్న ప్రధాని
Day After Poll Results Modi To Be On TwoDay Visit To Gujarat

ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికలకు సంబంధించి రేపు కౌంటింగ్ జరగనుంది. ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీకి అనుకూలంగానే ఫలితాలు వచ్చాయి. పంజాబ్ లో మాత్రం అరవింద్ కేజ్రీవాల్ పార్టీ ఆప్ కు జనాలు పట్టం కట్టబోతున్నారని తేలింది. 

మరోవైపు ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజు (మార్చి 11)న ప్రధాని మోదీ తన సొంత రాష్ట్రం గుజరాత్ కు వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు ఆయన గుజరాత్ లో పర్యటిస్తారు. ఈ ఏడాది చివర్లో గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న సంగతి గమనార్హం. శుక్రవారం నాడు ఒక భారీ ర్యాలీలో మోదీ ప్రసంగించనున్నారు. అంతేకాదు మూడు రోజుల ఆరెస్సెస్ సమావేశాల ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు.  

2017లో గుజరాత్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీకి పెద్ద ఎత్తున పోటీ ఎదురైంది. గుజరాత్ లో బీజేపీ వరుసగా ఆరో సారి గెలిచినప్పటికీ అనుకున్న మెజార్టీని సాధించలేకపోయింది. 182 సీట్లు ఉన్న అసెంబ్లీలో 150 సీట్లను గెలవాలనే టార్గెట్ ను అమిత్ షా నిర్ణయించినప్పటికీ... బీజేపీ కేవలం 99 స్థానాలకే పరిమితమయింది. కాంగ్రెస్ పార్టీ 20 స్థానాలలో పుంజుకుని 77 సీట్లను కైవసం చేసుకుంది.

మరోవైపు సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ యూపీ ఎన్నికలకు ముందు మాట్లాడుతూ, ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాలు పెద్ద ఆశ్చర్యాన్ని కలిగించబోవని... గుజరాత్ ఎన్నికల ఫలితాలు మాత్రం ఆశ్చర్యకరంగా ఉంటాయని అన్నారు.

More Telugu News