Rajya Sabha: ముగిసిన 5 రాష్ట్రాల ఎన్నిక‌లు.. మ‌రో ఎన్నిక‌కు రంగం సిద్ధం

  • 6 రాష్ట్రాల్లోని 13 రాజ్య‌స‌భ స్థానాల‌కు ఎన్నిక‌లు
  • 21న నోటిఫికేష‌న్‌, అదే రోజు నుంచి నామినేష‌న్లు
  • 24వ‌ర‌కు నామినేష‌న్ల ఉపసంహ‌ర‌ణ‌కు గ‌డువు
  • 31న పోలింగ్‌, అదే రోజు ఓట్ల లెక్కింపు
ec releases schedule for 13 rajyasabha seats election

దేశ‌వ్యాప్తంగా ఆస‌క్తి రేకెత్తించిన ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌తో పాటు మ‌రో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీల‌కు జ‌రుగుతున్న ఎన్నిక‌లు సోమ‌వారంతో ముగిశాయి. ఈ ఎన్నిక‌లు ఇలా ముగిశాయో,లేదో.. మ‌రో కీల‌క ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధమైపోయింది. దేశంలోని వివిధ రాష్ట్రాల‌కు సంబంధించి ఖాళీ కానున్న‌ 13 రాజ్య‌స‌భ స్థానాల ఎన్నిక‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం సోమ‌వారం షెడ్యూల్ ప్ర‌క‌టించింది. 5 రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాలు మ‌రో మూడు రోజుల్లో రానుండగా.. రాజ్య‌స‌భ స్థానాల ఎన్నిక‌ల ఫ‌లితాలు మాత్రం ఈ నెలాఖ‌రుకు వెల్లడవుతాయి.  

దేశంలోని ఆరు రాష్ట్రాల్లోని 13 రాజ్య‌స‌భ‌ స్థానాల ఎన్నికలకు సోమ‌వారం ఈసీ షెడ్యూల్‌ విడుదల చేసింది.. అసోంలో 2, హిమాచల్ ప్రదేశ్ లో 1, కేరళలో 3, నాగాలాండ్ లో 1, త్రిపురలో 1, పంజాబ్‌లో 5 రాజ్యసభ స్థానాలు.. ఇలా మొత్తం 13 రాజ్యసభ స్థానాలు ఏప్రిల్‌లో ఖాళీ కానున్న నేపథ్యంలో వీటిని ఆ లోగానే భ‌ర్తీ చేసేలా ఎన్నిక‌ల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. 

ఈ ఎన్నిక‌ల‌కు సంబంధించి ఈ నెల‌ 21న నోటిఫికేషన్‌ జారీ కానుండగా.. అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం అవుతుంది. మార్చి 24న నామినేషన్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు గడువు ఉంది. మార్చి 31న పోలింగ్, అదే రోజు ఓట్ల లెక్కింపు జరుగనుంది.

More Telugu News