YS Jagan: జ‌గ‌న్‌పై బ్ర‌ద‌ర్ అనిల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

  • జ‌గ‌న్ కోసం ప‌నిచేసిన క్రైస్త‌వులు ఆవేదనలో ఉన్నారన్న అనిల్ 
  • కొత్త పార్టీ ఆలోచ‌న లేదు.. ఏదైనా ఉంటే చెబుతానని వ్యాఖ్య  
  • విజయవాడలో పలు సంఘాలతో నేడు అనిల్ భేటీ  
brother anil kumar viral comments on ys jagan

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై ఆయ‌న సోద‌రి వైఎస్ ష‌ర్మిల‌ భ‌ర్త‌, ప్ర‌ముఖ క్రైస్త‌వ మ‌త బోధ‌కుడు బ్ర‌ద‌ర్ అనిల్ కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ష‌ర్మిల తెలంగాణ వేదిక‌గా కొత్త పార్టీ పెట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ వ్య‌వ‌హారంలో ష‌ర్మిల‌కు ఓ భ‌ర్త‌గా అనిల్ అన్నీ తానై చూసుకున్నార‌ని, తెరముందు ష‌ర్మిల క‌నిపిస్తే, తెర‌వెనుక మంత్రాంగం మొత్తం అనిలే న‌డిపిస్తున్నార‌న్న వాద‌న‌లు కూడా వినిపించాయి. ఇటీవ‌లే రాజ‌మ‌హేంద్రవ‌రం వ‌చ్చిన సంద‌ర్భంగా బ్ర‌ద‌ర్ అనిల్‌.. కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత, మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్‌తో భేటీ అయి స‌రికొత్త రాజ‌కీయ ఈక్వేష‌న్ల‌కు తెర తీశారు. 

తాజాగా సోమ‌వారం విజ‌య‌వాడ వ‌చ్చిన ఆయ‌న క్రైస్త‌వ సంఘాల ప్ర‌తినిధులతో పాటు ప‌లు బీసీ సంఘాల ప్ర‌తినిధుల‌తో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఏపీలో కూడా బ్ర‌ద‌ర్‌ అనిల్ కొత్త పార్టీ పెడుతున్నారంటూ పెద్ద ఎత్తున వార్త‌లు వెల్లువెత్తాయి. అంతేకాకుండా ఈ భేటీకి సంబంధించిన స‌మాచారం అందిన వెంట‌నే అక్క‌డ‌కు ప‌రుగులు పెట్టిన మీడియా ప్ర‌తినిధులు బ్ర‌ద‌ర్ అనిల్‌ను చుట్టుముట్టారు. 

ఈ సంద‌ర్భంగా సీఎం జ‌గ‌న్‌కు సంబంధించి బ్ర‌ద‌ర్ అనిల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ కోసం ప‌నిచేసిన క్రైస్త‌వులు ఇప్పుడు తీవ్ర ఆవేద‌న‌తో ఉన్నార‌ని అనిల్ అన్నారు. ఇటీవ‌లే త‌న‌తో భేటీ అయిన కొంద‌రు క్రైస్త‌వులు ఇదే మాట‌ను త‌న‌తో చెప్పార‌ని కూడా ఆయ‌న వ్యాఖ్యానించారు. అయితే, ఏపీ వేదిక‌గా తాము కొత్త పార్టీ పెడుతున్నామ‌న్న‌ది పూర్తిగా స‌త్య‌దూరమ‌ని. అదంతా అస‌త్య ప్ర‌చార‌మేన‌ని ఆయ‌న తెలిపారు. ఉండ‌వ‌ల్లిని క‌లిసిన అంశం వేరేద‌ని, అయినా ఏదైనా ఉంటే తానే స్వ‌యంగా వివ‌రాలు వెల్ల‌డిస్తాన‌ని అనిల్ చెప్పుకొచ్చారు.

More Telugu News