ICC Womens World Cup 2022: పాక్‌పై విరుచుకుపడిన మంధాన, రాణా, పూజ.. భారత్ భారీ స్కోరు

  • కష్టాల్లో పడిన జట్టును బయటపడేసిన స్నేహ్ రాణా, పూజా వస్త్రాకర్
  • పాక్ బౌలర్లకు చుక్కలు  
  • 245 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన మిథాలీ సేన
 ICC Womens World Cup 2022 India targets 245 runs to pak

ఐసీసీ మహిళల ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ అదరగొట్టింది. భారత బ్యాటర్లు స్మృతి మంధాన, స్నేహ్ రాణా, పూజా వస్త్రాకర్ అర్ధ సెంచరీలతో అదరగొట్టారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది. అర్ధ సెంచరీ అనంతరం స్మృతి మంధాన అవుటైన తర్వాత భారత్ వడివడిగా వికెట్లు కోల్పోతూ కష్టాల్లో పడినట్టు కనిపించింది. అయితే, స్నేహ్ రాణా, పూజా వస్త్రాకర్ క్రీజులో పాతుకుపోయి పాక్ బౌలర్లకు చుక్కలు చూపించారు. దీంతో స్కోరుబోర్డు ఉరకలెత్తింది. 

స్నేహ్ రాణా 48 బంతుల్లో 4 ఫోర్లతో 53 పరుగులు చేయగా, పూజా వస్త్రాకర్ చెలరేగింది. 59 బంతుల్లో 8 ఫోర్లతో 67 పరుగులు చేసి పాక్‌కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించడంలో కీలక పాత్ర పోషించింది. దీప్తి శర్మ 40 పరుగులు చేయగా, షెఫాలీ వర్మ (0), కెప్టెన్ మిథాలీ రాజ్ (9), హర్మన్‌ప్రీత్ కౌర్ (5), రిచా ఘోష్ (1) విఫలమయ్యారు. పాక్ బౌలర్లలో నిదా దార్, నష్రా సంధు చెరో రెండు వికెట్లు తీసుకోగా, డయానా బేగ్, అనమ్ అమిన్, ఫాతిమా సనా తలో వికెట్ పడగొట్టారు.

More Telugu News