Nirmala Sitharaman: అనంతపురం జిల్లాలో నిర్మలా సీతారామన్ పర్యటన... ప్రోటోకాల్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన వైసీపీ ఎంపీలు

  • పాలసముద్రం వద్ద నాసిన్ అకాడమీ శంకుస్థాపన
  • హాజరైన నిర్మలా సీతారామన్
  • తనకు వాట్సాప్ లో ఆహ్వానం పంపారన్న ఎంపీ రంగయ్య
  • జాబితాలో తన పేరే లేదన్న ఎంపీ గోరంట్ల
YCP MPs disappoints with officials in Nirmala Sitharaman visit

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏపీలోని అనంతపురం జిల్లాలో పర్యటించారు. పాలసముద్రం గ్రామంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్ డైరెక్ట్ ట్యాక్సెస్ మరియు నార్కొటిక్స్ (నాసిన్) అకాడమీ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే, ఈ కార్యక్రమం ప్రోటోకాల్ పై వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు ప్రోటోకాల్ పాటించలేదని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కు ఆయన ఫిర్యాదు చేశారు. నాసిన్ అకాడమీ శంకుస్థాపన కార్యక్రమం ఆహ్వాన జాబితాలో తన పేరు లేదని ఆరోపించారు. అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. 

అటు, వైసీపీకి చెందిన మరో ఎంపీ రంగయ్య కూడా ఇదే తీరులో మండిపడ్డారు. నాసిన్ అకాడమీ భవనాల శంకుస్థాపనకు తనకు వాట్సాప్ లో ఆహ్వానం పంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన దూరంగా ఉన్నారు. కేంద్ర మంత్రి వస్తుంటే ఎంపీనైన తనకు అధికారులెవరూ ఫోన్ చేయలేదని వెల్లడించారు. కేంద్ర మంత్రి కార్యక్రమానికి ఎంపీలను పిలవాల్సిన అవసరం లేదా? అని ప్రశ్నించారు. కేంద్రమంత్రి పర్యటనలో బీజేపీ నేతలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారంటూ ఆయన ఆరోపించారు.

More Telugu News