Telangana: నామినేటెడ్ ప‌ద‌వుల్లో మ‌హిళ‌ల వాటా ఎంత‌?: టీ కాంగ్రెస్ నేత ర‌వ‌ళి

  • కాంగ్రెస్‌తోనే స‌బిత‌, క‌విత‌ల‌కు గుర్తింపు
  • టీఆర్ఎస్ అధికారంలోకి వ‌చ్చాకే మ‌హిళ‌లు బ‌తుకుతున్నారా?
  • ఆరేళ్ల బాలికపై నాన్ బెయిల‌బుల్ కేసు టీఆర్ఎస్ స‌ర్కారు ఘ‌న‌త‌
  • టీ కాంగ్రెస్ అధికార ప్ర‌తినిధి ర‌వ‌ళి తీవ్ర విమ‌ర్శ‌లు
tpcc spokesperson ravali fires on trs

ప్రపంచ మ‌హిళా దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని తెలంగాణ ప్ర‌భుత్వం మూడు రోజుల పాటు సంబ‌రాలు చేసుకోవాలంటూ ఇచ్చిన పిలుపుపై కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఈ మేర‌కు టీ కాంగ్రెస్ అధికార ప్ర‌తినిధి ర‌వ‌ళి... టీఆర్ఎస్ స‌ర్కారుపై విరుచుకుప‌డ్డారు. 

టీఆర్ఎస్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాతే రాష్ట్రంలో మ‌హిళ‌లు బ‌తుకుతున్న‌ట్లుగా ఆ పార్టీ నేత‌లు కల‌రింగ్ ఇస్తున్నార‌ని కూడా ఆమె మండిపడ్డారు. టీఆర్ఎస్ వ‌చ్చాకే ఆడ‌పిల్ల‌ల‌కు పెళ్లిళ్లు అయిన‌ట్టు, టీఆర్ఎస్ వ‌చ్చాకే పిల్ల‌లు పుడుతున్నట్లుగా టీఆర్ఎస్ నేత‌లు చేస్తున్నార‌ని ఆమె సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అస‌లు నామినేటెడ్ ప‌ద‌వుల్లో మ‌హిళ‌ల‌కు ఎన్ని ప‌ద‌వులు కేటాయించారో చెబుతారా? అంటూ ర‌వ‌ళి ప్ర‌శ్నించారు.

టీఆర్ఎస్ ప్ర‌భుత్వంలో మంత్రులుగా కొన‌సాగుతున్న స‌బితా ఇంద్రారెడ్డి, మాలోతు క‌వితల‌కు రాజ‌కీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీనేన‌ని వారిద్ద‌రూ గుర్తుంచుకోవాల‌ని ర‌వ‌ళి అన్నారు. టీఆర్ఎస్ మ‌ద్యం పాల‌సీ వ‌ల్ల ఎంతో మంది ఆడ‌బిడ్డ‌ల తాళిబొట్లు తెగాయ‌ని ఆమె ఆరోపించారు. ఖమ్మంలో ఆరేళ్ల బాలికపై నాన్ బెయిలబుల్ కేసు పెట్టిన విషయం టీఆర్ఎస్ నేతలు మర్చిపోయారా? అని ప్ర‌శ్నించిన ఆమె.. గిరిజన మహిళా రైతులను చెట్లకు కట్టేసి కొట్టిన చరిత్ర టీఆర్ఎస్‌దని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ సంబరాలను బ‌హిష్కరించాల‌ని ఆమె పిలుపునిచ్చారు.

More Telugu News