Bibhu Prakash Swain: 18 మందిని పెళ్లాడిన నిత్య పెళ్లికొడుకు... వయసు 67

  • ఒడిశాకు చెందిన బిభు ప్రకాశ్ స్వైన్ అరెస్ట్
  • ఒంటరి మహిళలే టార్గెట్
  • పెళ్లి చేసుకుని నగలు, నగదుతో పరార్
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన 14వ భార్య
Odisha man married eighteen women

పోలీసుల విచారణలో ఓ నిత్య పెళ్లికొడుకుకు సంబంధించి దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడయ్యాయి. అతడి పేరు బిభు ప్రకాశ్ స్వైన్. వయసు 67 సంవత్సరాలు. ఇప్పటిదాకా 18 మందిని పెళ్లాడినట్టు భావిస్తున్నారు. తనను తాను డాక్టర్ గా మ్యాట్రిమొనీ వెబ్ సైట్లలో పరిచయం చేసుకుని, మహిళా ప్రొఫెసర్లు, న్యాయవాదులు, డాక్టర్లను, ఓ పారామిలిటిరీ అధికారిణిని పెళ్లాడినట్టు గుర్తించారు.

బిభు ప్రకాశ్ స్వైన్ ఒడిశాకు చెందిన వ్యక్తి. కేంద్రపార జిల్లాలోని ఓ చిన్న గ్రామానికి చెందిన బిభు ప్రకాశ్ వృత్తిరీత్యా ఓ ల్యాబ్ టెక్నీషియన్. మొదటి భార్య ద్వారా ముగ్గురు పిల్లలు ఉన్నారు. వాళ్లు ముగ్గురూ డాక్టర్లు అయ్యారు. కాగా, మొదటి భార్య నుంచి విడిపోయి భువనేశ్వర్ కు వచ్చి నిత్య పెళ్లికొడుకుగా మారాడు. ధనాశతో పాటు లైంగికానందం కూడా అతడిని ఈ మోసాలకు పాల్పడేట్టు చేసిందని సీనియర్ పోలీస్ అధికారి సంజీవ్ సత్పతి వెల్లడించారు.

కాగా, తాను కేంద్ర వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నానంటూ నకిలీ ఐడీలు, అపాయింట్ మెంట్ లెటర్లు ఉపయోగించేవాడు. తనకు పెద్ద మొత్తంలో జీతం వచ్చేదని నమ్మబలికేవాడు. మ్యాట్రిమొని వెబ్ సైట్ల ద్వారా పరిచయం అయిన మహిళలకు గాలం వేసేవాడు. అయితే, ఢిల్లీకి చెందిన ఓ మహిళ కూడా బిభు ప్రకాశ్ మోసానికి బలైంది. ఆమె అతడికి 14వ భార్య. ఆమె పోలీసులను ఆశ్రయించడంతో అతడి గుట్టురట్టయింది.

అతడి ఫోన్ డేటాను పరిశీలించిన పోలీసులు ఆశ్చర్యపోయారు. మేడమ్ ఢిల్లీ, మేడమ్ యూపీ, మేడమ్ అసోం అంటూ తాను పెళ్లి చేసుకున్న మహిళల పేర్లను ఫోన్ లో ఫీడ్ చేసుకున్నాడు. ఇక, పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా, బిభు ప్రకాశ్ బాధితులు ఒక్కొక్కరుగా బయటికి రావడం మొదలుపెట్టారు. ఢిల్లీ, అసోం, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, ఝార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన మహిళలు అతడి బాధితుల జాబితాలో ఉన్నారు.

పెళ్లి చేసుకోవడం, వారితో కొన్నిరోజుల పాటు తన లైంగిక అవసరాలు తీర్చుకోవడం, ఆపై నగలు, డబ్బుతో పరారవడం అతడి నైజం. ఇటీవలే పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. దీనిపై సీనియర్ పోలీస్ అధికారి సంజీవ్ సత్పతి మాట్లాడుతూ, బిభు ప్రకాశ్ స్వైన్ ఎప్పుడూ కూడా 40 ఏళ్లకు పైబడిన ఒంటరి మహిళలు, వితంతు, విడాకులు తీసుకున్న వారినే టార్గెట్ చేసేవాడని వివరించారు. వారికి ఏమాత్రం అనుమానం రాకుండా వ్యవహరించేవాడని, పెళ్లయిన కొన్నిరోజుల తర్వాత తనకు అత్యవసరంగా డబ్బు కావాలంటూ వారి నుంచి నగదు, డబ్బు తీసుకుని పారిపోయేవాడని తెలిపారు.

కాగా, మరికొన్ని వారాల్లో మరో ఇద్దరిని పెళ్లాడేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడని కూడా పోలీసులు వెల్లడించారు. కాగా, అతడి పెళ్లిళ్లకు సహకరించిన వారికోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా, అతడు బ్యాంకులను కూడా మోసం చేసినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. 128 తప్పుడు క్రెడిట్ కార్డులతో 13 బ్యాంకులను రూ.1 కోటి మేర మోసం చేసినట్టు గుర్తించారు.

More Telugu News