CCPA: తప్పుదోవ పట్టించే ప్రకటనలు.. వెంటనే ఆపేయాలంటూ సెన్సోడైన్ టూత్ పేస్ట్, నాప్టోల్ లకు కేంద్రం తాఖీదులు

  • సెన్సోడైన్ ప్రకటనలో వ్యాఖ్యానాలపై విచారణకు ఆదేశం
  • విదేశీ డెంటిస్టులతో ప్రకటనలు నిబంధనలకు విరుద్ధం 
  • నాప్టోల్ ది అనైతిక వ్యాపారమంటూ మండిపాటు
CCPA Issues Notices To GSK and Naaptol To Stop All Unfair Ads

దేశంలో సెన్సోడైన్ టూత్ పేస్ట్ ప్రకటనలన్నింటినీ ఆపేయాల్సిందిగా గ్లాక్సోస్మిత్ క్లైన్ (జీఎస్ కే) కన్జ్యూమర్ హెల్త్ కేర్ లిమిటెడ్ సంస్థను వినియోగదారుల భద్రత సంస్థ సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలను ఉల్లంఘించి ప్రకటనలను తీశారని సంస్థ పేర్కొంది. అంతేగాకుండా నాప్టోల్ ఆన్ లైన్ షాపింగ్ లిమిటెడ్ సంస్థపైనా ఆక్షేపణలు చేసింది. ప్రజలు, వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలను ఇస్తున్నారని, అనైతిక వ్యాపారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. సంస్థకు రూ.10 లక్షల జరిమానా వేసింది.

జీఎస్కే, నాప్టోల్ ప్రకటనలపై సీసీపీఏ సుమోటోగా కేసును స్వీకరించిన సీసీపీఏ.. జనవరి 27న జీఎస్కేకి, ఫిబ్రవరి 2న నాప్టోల్ కు నోటీసులు ఇచ్చినట్టు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ ప్రకటన జారీ చేసింది. ఏడు రోజుల్లోగా సెన్సోడైన్ ప్రకటనలను ఆపేయాల్సిందిగా జీఎస్కేకి ఆదేశాలిచ్చిందని ప్రకటనలో తెలిపింది.

భారత్ వెలుపల ప్రాక్టీస్ చేస్తున్న డెంటిస్టులతో ప్రకటనలు చేయించి భారత్ లో ప్రసారం చేశారని పేర్కొంది. అది భారత నిబంధనలకు విరుద్ధమని చెప్పింది. అంతేగాకుండా సెన్సోడైన్ ప్రకటనల్లో పేర్కొన్నట్టు ‘ప్రపంచవ్యాప్తంగా డెంటిస్టులు సిఫార్సు చేస్తున్న నెంబర్ వన్ సెన్సిటివిటీ టూత్ పేస్ట్ సెన్సోడైన్’, ‘60 క్షణాల్లోనే పంటి నొప్పి నుంచి ఉపశమనం.. క్లినికల్ గా నిరూపణ’ వంటి కామెంట్లపై విచారణ జరపాల్సిందిగా డైరెక్టర్ జనరల్ (ఇన్వెస్టిగేషన్) సీసీపీఏ ఆదేశించింది.

‘సెట్ ఆఫ్ 2 బంగారు ఆభరణాలు’, ‘మ్యాగ్నెటిక్ మోకాలి సపోర్ట్’, ‘ఆక్యుప్రెషర్ యోగా స్లిప్పర్స్’ వంటి నాప్టోల్ ప్రకటనలపైనా సీసీపీఏ సుమోటోగా తీసుకుని నోటీసులిచ్చినట్టు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. కృత్రిమ కొరత సృష్టించేలా ఉండే ప్రకటనలను వెంటనే ఆపేయాల్సిందిగా ఆదేశాలిచ్చినట్టు తెలిపింది.

More Telugu News