Kanakamedala Ravindra Kumar: సరిగ్గా పవన్ కల్యాణ్ సినిమా విడుదలకు ముందు టికెట్ల అంశాన్ని తెరపైకి తెచ్చారు: ఏపీ ప్రభుత్వంపై కనకమేడల విమర్శలు

  • రాజ్యసభలో కనకమేడల ప్రసంగం
  • ఏపీలో అరాచకపాలన నడుస్తోందని వ్యాఖ్యలు
  • వ్యాపార వాతావరణం దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని విమర్శలు
Kanakamedala slams AP Govt on cinema tickets issue in Rajya Sabha

ఏపీలో అరాచక పాలన నడుస్తోందని టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ రాజ్యసభలో వ్యాఖ్యానించారు. ఆయన తన ప్రసంగంలో భాగంగా వైసీపీ సర్కారుపై విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యాపారవేత్తల సామాజిక నేపథ్యం ఆధారంగా దెబ్బతీసే చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఓ పద్ధతి ప్రకారం రాష్ట్రంలో వ్యాపార, పారిశ్రామిక వాతావరణాన్ని దెబ్బతీస్తోందని అన్నారు. ఇటీవల జరిగిన ఓ సంఘటనే అందుకు నిదర్శనమని తెలిపారు.

ఓ ప్రాంతీయ పార్టీకి నాయకత్వం వహిస్తున్న పవన్ కల్యాణ్ నటించిన కొత్త చిత్రం విడుదల కావాల్సి ఉండగా, సరిగ్గా అదే సమయంలో టికెట్ల ధరల క్రమబద్ధీకరణ అంశాన్ని ప్రభుత్వం తెరపైకి తెచ్చిందని కనకమేడల వివరించారు. ఈ నిర్ణయం తీవ్ర వివాదాస్పదం అయిందని, ఈ కారణంగా అనేక సినిమాలు విడుదల కాలేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని సమస్యలున్నా పనిగట్టుకుని మరీ టికెట్ ధరలపైనే ఫోకస్ చేస్తోందని ఆరోపించారు.

More Telugu News