Corona Virus: టీనేజర్లకు కరోనా టీకా: హనుమకొండలో 103% మందికి.. చివరి స్థానంలో హైదరాబాద్, రంగారెడ్డి!

  • రంగారెడ్డిలో కేవలం 51% మందికే టీకా
  • టీకా కవరేజీలో చివరి స్థానం
  • చివరి నుంచి రెండో స్థానంలో ఆదిలాబాద్
  • హైదరాబాద్ లో 55 శాతం మందికి వ్యాక్సిన్
Vaccination Coverage For Teenagers In Hanumakonda is 103 Percent

తెలంగాణలో టీనేజర్లకు (15 నుంచి 17 ఏళ్లవారు) వ్యాక్సినేషన్ లో అసాధారణ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. హనుమకొండలో 103 శాతం మేర వ్యాక్సినేషన్ జరగ్గా.. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో మాత్రం 50 శాతమే జరిగింది.

రాష్ట్రంలోని 11 జిల్లాల్లో టీనేజర్లకు వ్యాక్సినేషన్ కవరేజీ 70 శాతం లోపే ఉంది. ఈ జాబితాలో రంగారెడ్డి జిల్లా చివరి స్థానంలో ఉంది. అక్కడ కేవలం 51 శాతం మంది టీనేజర్లకే కరోనా టీకాలు అందాయి. ఈ జిల్లాలో 1,77,102 మంది 15 నుంచి 17 ఏళ్ల లోపువారుండగా.. కేవలం 90,046 మందికే ఇప్పటిదాకా కరోనా వ్యాక్సిన్ వేశారు.

చివరి నుంచి రెండో స్థానంలో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా నిలిచింది. ఆ జిల్లాలో 26,783 మందికిగానూ 14,054 మందికి (52%) టీకాలు వేశారు. హైదరాబాద్, వికారాబాద్ లలో 55 శాతం మందికి కరోనా టీకా ఇచ్చారు. జనవరి మొదటి వారంలో తాము అంచనా వేసిన దాని కన్నా తక్కువగా, చాలా స్లోగా వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతోందని డాక్టర్లు చెబుతున్నారు.

పిల్లలకు టీకా వేయించకపోవడం ఇష్టం లేక కాదని, కాకపోతే ప్రస్తుత పరిస్థితులు బాగానే ఉండడం వల్ల టీకా ఎందుకులే అన్న నిర్లక్ష్యంలో ఉండి ఉంటారని అంటున్నారు. కరోనా నియంత్రణలోకి రావడం, కేసులు తగ్గుతుండడంతో నిర్లక్ష్యం చూపిస్తూ ఉండొచ్చని చెబుతున్నారు.  

More Telugu News