Mahesh Babu: భారత అండర్-19 క్రికెట్ జట్టుకు శుభాకాంక్షలు తెలిపిన మహేశ్ బాబు

  • వెస్టిండీస్ వేదికగా అండర్-19 వరల్డ్ కప్
  • నేడు ఫైనల్ మ్యాచ్.. భారత్ వర్సెస్ ఇంగ్లండ్
  • సాయంత్రం 6.30 గంటలకు మ్యాచ్
  • కప్ తీసుకురావాలన్న మహేశ్, కోహ్లీ, సచిన్
Mahesh Babu wishes the best Indian colts

అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్ కు సిద్ధమైన భారత కుర్రాళ్ల జట్టుకు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు శుభాకాంక్షలు తెలిపారు. యశ్ ధూల్ నాయకత్వంలోని భారత అండర్-19 జట్టు నేడు టైటిల్ సమరంలో ఇంగ్లండ్ తో అమీతుమీ తేల్చుకోనుంది. ఆంటిగ్వాలోని నార్త్ సౌండ్ లో జరిగే ఈ ఫైనల్ మ్యాచ్ కు సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియం వేదికగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో, టీమిండియా కుర్రాళ్లు కప్ గెలవాలంటూ శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

మహేశ్ బాబు ట్విట్టర్ లో స్పందిస్తూ, ఈ అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో భారత యువ జట్టుకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నానని తెలిపారు. "పోరాడండి... స్వదేశానికి ట్రోఫీని తీసుకురండి" అని మహేశ్ పిలుపునిచ్చారు. అటు, భారత అండర్-19 కుర్రాళ్లతో ప్రత్యేకంగా మాట్లాడిన భారత అగ్రశ్రేణి ఆటగాడు విరాట్ కోహ్లీ మరోసారి ఆల్ ది బెస్ట్ చెప్పాడు. వరల్డ్ కప్ ఫైనల్లో విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపాడు.

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ భారత కుర్రాళ్ల కోసం వీడియో సందేశం విడుదల చేశాడు. "వంద కోట్ల మంది మీ వెనుక ఉన్నారు...  టీమిండియా కోసం మెరుగైన ప్రదర్శన కనబర్చండి" అని పిలుపునిచ్చారు.

అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఈ సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ ను స్టార్ స్పోర్ట్స్ చానల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు.

More Telugu News