Vijayasai Reddy: టీటీడీకి విరాళాల అంశాన్ని రాజ్య‌స‌భ‌లో ప్ర‌స్తావించిన ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి

  • మూడో రోజు పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం
  • హిందువులకు అత్యంత పవిత్ర స్థ‌లం తిరుమ‌ల
  • టీటీడీ అనేక ధార్మిక, సేవా కార్యక్రమాలు కొన‌సాగిస్తోంది
  • విదేశీ విరాళాలు అందేలా స‌హ‌క‌రించాల‌ని విజ‌య‌సాయిరెడ్డి విజ్ఞ‌ప్తి
vijay sai speaks in rajya sabha

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు మూడో రోజు ప్రారంభ‌మ‌య్యాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో చర్చ జ‌రిగింది. ఈ సమావేశాల్లో భాగంగా జీరో అవర్‌లో తిరుమల తిరుపతి గురించి వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప‌లు విష‌యాలు ప్రస్తావించారు.

హిందువులకు అత్యంత పవిత్రమైన స్థ‌లం తిరుమ‌ల అని ఆయన చెప్పారు. టీటీడీ అనేక ధార్మిక, సేవా కార్యక్రమాలు కొన‌సాగిస్తోంద‌ని, వాటి నిర్వహణకు భారీ స్థాయిలో నిధులు అవసరం అవుతాయని అన్నారు. టీటీడీకి విదేశాల నుంచి ప్రవాస భారతీయులు విరాళాలు పంపిస్తుంటారని, అయితే, కేంద్ర హోంశాఖ సాంకేతిక కారణాలతో ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్సును తాత్కాలికంగా నిలిపివేసిందని చెప్పారు.

అనంత‌రం తగిన పత్రాలన్నీ సమర్పించినప్పటికీ లైసెన్స్ పునరుద్ధరించలేదని అన్నారు. గ‌త ఏడాది డిసెంబర్ 31 నాటికి రూ.13.04 కోట్ల నిధులు ఎఫ్‌సీఆర్‌ఏ అనుసంధాన బ్యాంకు ఖాతాలో ఉన్నాయని ఆయ‌న వివ‌రించారు. యాక్ట్ ఈస్ట్ పాలసీ తరహాలో లుక్ సౌత్ పాలసీని అమలు చేయాలని విజ‌య‌సాయిరెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. టీటీడీ విషయంలో బీజేపీ నేత‌లు ఎందుకు ఉదాసీనంగా ఉన్నారని ఆయ‌న నిల‌దీశారు.

More Telugu News