Andhra Pradesh: రివర్స్ పీఆర్సీ ఇచ్చారు.. గుంటూరులో వెనక్కి నడిచి ఉద్యోగుల ఆందోళన

  • రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న నిరసనలు
  • 30 శాతం సిఫార్సు చేస్తే 23 శాతమే ఇస్తారా అని సచివాలయ ఉద్యోగుల సంఘం ప్రశ్న
  • ఉద్యమాన్ని నిర్వీర్యం చేసే కుట్ర అన్న బొప్పరాజు

ఏపీ ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. రివర్స్ పీఆర్సీ ఇచ్చారంటూ గుంటూరులో ఉద్యోగులు వెనక్కు నడిచి నిరసన వ్యక్తం చేశారు. గుంటూరు కలెక్టరేట్ వద్ద జరిగిన ఆందోళనల్లో పాత వేతనాలే ఇవ్వాలంటూ నినాదాలతో హోరెత్తించారు.  

ఏపీ ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీతో ఉద్యోగులకు తీవ్ర నష్టం జరుగుతోందని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు, పీఆర్సీ సాధన సమితి నేత వెంకట్రామిరెడ్డి అన్నారు. కర్నూలులో ఉద్యోగులు చేపట్టిన ఆందోళనల్లో ఆయన పాల్గొన్నారు. కమిటీ 30 శాతం పీఆర్సీని సిఫార్సు చేస్తే.. కేవలం 23 శాతమే ప్రకటించడమేంటని ప్రభుత్వంపై మండిపడ్డారు. ఉద్యోగులకు ఇంత తక్కువ వేతనాలు ఇవ్వడం న్యాయమా? అని ప్రశ్నించారు.

పీఆర్సీ కోసం ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు చేస్తున్న ఆందోళనలను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్, పీఆర్సీ సాధన సమితి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆరోపించారు. శ్రీకాకుళంలో ఏపీ ఎన్జీవో హోమ్ వద్ద ఉద్యోగులు చేపట్టిన నిరాహారదీక్ష శిబిరానికి ఆయన వెళ్లారు. ఉమ్మడి కార్యాచరణలో భాగంగా అన్ని జిల్లాల్లోనూ ఉద్యమం సాగుతోందన్నారు. నాలుగు జేఏసీలు న్యాయమైన పోరాటం చేస్తున్నాయన్నారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

More Telugu News