GVL Narasimha Rao: ఆంధ్ర సంప్రదాయాలపై నిషేధం ఉందా?: బీజేపీ ఎంపీ జీవీఎల్

  • గుడివాడ వెళుతున్న ఏపీ బీజేపీ నేతలు
  • నందమూరు వద్ద అడ్డుకున్న పోలీసులు
  • వాహనాలు దిగి కాలినడకన బయల్దేరిన నేతలు
  • పోలీసుల తీరును ఖండించిన జీవీఎల్
GVL questions AP CM Jagan

సంక్రాంతి అంటే కేసినోలు, చీర్ గాళ్స్ కాదని, సంక్రాంతి సంప్రదాయాలు ఎలా ఉంటాయో తాము గుడివాడ నుంచి చాటిచెబుతామని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ప్రకటించడం తెలిసిందే. అయితే సోము వీర్రాజు నేతృత్వంలో గుడివాడ వెళ్లేందుకు ప్రయత్నించిన ఏపీ బీజేపీ బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంక్రాంతి సంబరాలను సంప్రదాయబద్ధంగా జరుపుకునేందుకు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆధ్వర్యంలో గుడివాడ వెళుతున్న బీజేపీ బృందాన్ని అడ్డుకోవడాన్ని ఖండిస్తున్నానని తెలిపారు. సంక్రాంతి సంప్రదాయాలపై నిషేధం ఉందా? అంటూ సీఎం జగన్ ను ప్రశ్నించారు. అర్ధనగ్న డ్యాన్సులకు "ఊ" అంటూ, ముగ్గు పోటీలకు "ఊఊ" అంటారా? అని మండిపడ్డారు.

గుడివాలో జరుగుతున్న సంక్రాంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు సోము వీర్రాజు, ఎంపీ సీఎం రమేశ్ తదితర బీజేపీ నేతలు విజయవాడ నుంచి బయల్దేరారు. అయితే గన్నవరం సమీపంలో నందమూరు వద్ద వారిని పోలీసులు నిలువరించారు. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్తతలు నెలకొనడంతో సోము వీర్రాజు తదితరులు వాహనాలు దిగి కాలినడకన గుడివాడ బయల్దేరారు.

More Telugu News