YS Sharmila: కేసీఆర్ గారు సిగ్గుతో తలదించుకోవాలి: వైయస్ షర్మిల

  • ఇంటికో ఉద్యోగం వస్తుందని విద్యార్థులను మోసం చేశారు
  • డిగ్రీలు చదివిన వారిని హమాలీ పని చేసుకునేలా చేశారు
  • ఐదు, పదో తరగతి కూడా చదవని వారిని మంత్రులను చేశారు
Sharmila fires on KCR

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైయస్సార్టీపీ అధ్యక్షురాలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుందని విద్యార్థులను మోసం చేసినందుకు, ఏడేళ్ల పాలనలో నోటిఫికేషన్స్ ఇవ్వనందుకు, డిగ్రీలు చదివిన వాళ్లను హమాలీ పని చేసుకునేలా, పీజీలు చదివిన వాళ్లను రోడ్ల మీద ఛాయ్ అమ్ముకునేలా చేసి... ఐదు, పదో తరగతి కూడా చదవని వాళ్ల‌ను మంత్రులు చేసినందుకు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా మీ ఇంట్లో 4 ఉద్యోగాలు ఇచ్చుకున్నందుకు, నోటిఫికేషన్ల కోసం ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోనందుకు కేసీఆర్ గారు సిగ్గుపడాలని అన్నారు. అవమానంతో తలదించుకోవాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చదువుకున్న యువతకు ఉద్యోగాలివ్వడం చేతకాని ముఖ్యమంత్రి మనకొద్దని చెప్పారు.
 
మరోవైపు ఈరోజు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఆమె స్పందిస్తూ... ఓటుతోనే మార్పు సాధ్యమని చెప్పారు. మెరుగైన స‌మాజ నిర్మాణానికి ఓటే వ‌జ్రాయుధమని అన్నారు. అవినీతి, అక్ర‌మాలు అంతం కావాల‌న్నా.. నియంత‌, నిరంకుశ పాల‌న పోవాలన్నా ఓటు హ‌క్కును ప్రతి ఒక్కరూ విధిగా ఉప‌యోగించుకోవాలని చెప్పారు. అందరం నిస్వార్థంగా ఓటు వేద్దామని... మన బతుకులు మార్చుకుందామని కోరారు.

More Telugu News