KTR: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కు తెలంగాణ మంత్రి కేటీఆర్ లేఖ

  • త్వరలో కేంద్ర బడ్జెట్
  • తెలంగాణకు మరిన్ని నిధుల కోసం కేటీఆర్ ప్రయత్నం
  • తెలంగాణ పారిశ్రామికంగా ఎదుగుతోందని వెల్లడి
  • సాయంగా నిలవాలని కేంద్రానికి విజ్ఞప్తి
Telangana minister KTR wrote union finance minister Nirmala Sitharaman

తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు. తెలంగాణలో పారిశ్రామిక మౌలిక వసతుల కల్పనకు కేంద్ర బడ్జెట్ లో నిధులు కేటాయించాలని కోరారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుంచి పారిశ్రామిక రంగం అభివృద్ధిలో తెలంగాణ ముందుందని వెల్లడించారు. నేషనల్ డిజైన్ సెంటర్ ఏర్పాటుకు నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై కేంద్రానికి గతంలో అనేకసార్లు విజ్ఞప్తులు చేశామని తెలిపారు.

వినూత్నమైన విధానాలతో ముందు వరుసలో నిలుస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం సహాయం అందించాల్సిన అవసరం ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. ఇండస్ట్రియల్ కారిడార్ కు కూడా నిధులు కేటాయించాలని, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే హైదరాబాద్-వరంగల్, హైదరాబాద్-నాగపూర్ ఇండస్ట్రియల్ కారిడార్ లను గుర్తించిందని కేటీఆర్ తన లేఖలో ప్రస్తావించారు. ఇండస్ట్రియల్ కారిడార్ లో భాగమైన హైదరాబాద్ ఫార్మా సిటీ, నేషనల్ ఇండస్ట్రియల్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ అభివృద్ధికి అవసరమైన ఆర్థికసాయాన్ని సత్వరమే అందజేయాలని తెలిపారు.

గత ఏడేళ్లలో తెలంగాణ రాష్ట్రం రక్షణ, ఏరోస్పేస్ రంగాల్లో అద్భుతమైన ప్రగతి సాధించిందని, ఈ నేపథ్యంలో కేంద్రం ప్రతిపాదించిన రెండు డిఫెన్స్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కారిడార్ల పరిధిలో హైదరాబాద్ ను కూడా చేర్చాలని నిర్మలా సీతారామన్ ను తన లేఖలో కోరారు.

ఈ నెల 31న పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కేంద్ర వార్షిక బడ్జెట్ కు ఆర్థిక శాఖ కసరత్తులు చేస్తున్న నేపథ్యంలో తెలంగాణకు వీలైనన్ని ఎక్కువ నిధులు రాబట్టేందుకు కేటీఆర్ ఈ లేఖ రాసినట్టు తెలుస్తోంది.

More Telugu News