China: ముందు డబ్బు.. ఆ తర్వాతే బంధం.. పాక్ ముక్కుపిండి మరీ వసూలు చేసిన చైనా

  • దసూ హైడ్రో పవర్ డ్యామ్ వద్ద ఆత్మాహుతి దాడి పరిహారంపై చైనా పట్టు
  • దాడిలో 36 మంది చైనా కార్మికుల మృతి
  • రూ.282 కోట్ల పరిహారం ఇవ్వాలన్న చైనా
  • డబ్బుల్లేక ముందు ససేమిరా అన్న పాక్
  • చివరకు రూ.86.32 కోట్లు ఇచ్చేందుకు ఓకే
China Demands Money From Pakistan

పాక్ – చైనా మధ్య ఎంతటి దృఢమైన బంధం ఉందో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. కానీ, డబ్బుల దగ్గర మాత్రం చైనా కరాఖండిగా ఉంటోంది. పాకిస్థాన్ లోని దసు హైడ్రోపవర్ డ్యామ్ వద్ద జరిగిన ఆత్మాహుతి దాడిలో చనిపోయిన చైనా కార్మికులకు పాక్ ముక్కుపిండి మరీ చైనా పరిహారం ఇప్పించుకుంటోంది. 2021 జులై 14న జరిగిన ఆత్మాహుతి దాడిలో 36 మంది చైనా కార్మికులు చనిపోయారు.

అయితే, వారి కుటుంబాలందరికీ రూ.282 కోట్ల (3.8 కోట్ల డాలర్లు) పరిహారం ఇవ్వాలని పాక్ కు చైనా తేల్చి చెప్పింది. అయితే, దేశాన్ని నడిపేందుకే అష్టకష్టాలు పడుతున్న పాకిస్థాన్.. ఆ మొత్తం ఇచ్చేందుకు ససేమిరా అంది. దీంతో చైనా రివర్స్ లో పనికానిచ్చింది. దసు డ్యామ్ పనులను నిలిపివేయించింది. ఆ డ్యామ్ పనులను చేస్తున్నది చైనాకు చెందిన కాంట్రాక్టరే కావడంతో అర్ధంతరంగా తప్పుకొన్నాడు. తమ డిమాండ్లను నెరవేరిస్తేనే మళ్లీ పనులను మొదలుపెడతామని హెచ్చరించాడు.

దీంతో ది ఎకనామిక్ కో–ఆర్డినేషన్ కమిటీ, పాక్ ఆర్థిక మంత్రి షౌకత్ తారీన్ భేటీ అయి.. రూ.86.32 కోట్లు (1.16 కోట్ల డాలర్లు) ఇచ్చేందుకు అంగీకరించింది. అయితే, దసు డ్యామ్ పనుల నిలిపివేతతో తమకేం సంబంధంలేదంటూ చైనా విదేశాంగ ప్రతినిధి చెప్పడం గమనార్హం. వాస్తవానికి చైనా పరిహారం డిమాండ్ చేసిన మొదట్లో.. నెపాన్ని భారత్ పై నెట్టేందుకు పాక్ ప్రయత్నించింది. భారత నిఘా సంస్థ (రా), ఆఫ్ఘన్ నిఘా సంస్థలు కలిసి దాడి చేశాయని ఆరోపించింది. అయితే, దానికి ఎలాంటి ఆధారాలు చూపలేకపోయింది. పాకిస్థాన్ ఉగ్రవాదులు, తాలిబన్లే ఆ ఆత్మాహుతి దాడి చేసినట్టు తర్వాత తేలింది.

More Telugu News