COVID19: ఈ రెండేళ్లలో ఒక్క కరోనా కేసూ లేదు.. ఇప్పుడు రావడంతో లాక్ డౌన్ పెట్టేసిన రెండు దేశాలు!

  • లాక్ డౌన్ విధించిన కిరిబాటి, సమోవా
  • కిరిబాటిలో ఇప్పటిదాకా జీరో కేసులు
  • సమోవాలో రెండు మాత్రమే నమోదు
  • ఆ రెండు దేశాల్లో ఇప్పుడు డజన్ల కొద్దీ కేసులు
  • ఒమిక్రాన్ వేనన్న అనుమానాలు
Kiribati and Samoa Are Under Lock Down Now

అవి పసిఫిక్ దీవుల్లోని ఎక్కడో మారుమూల దేశాలు. కరోనా మహమ్మారి ప్రారంభం అయిన రెండేళ్ల నుంచి ఇప్పటిదాకా అక్కడ ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. కానీ, ఒమిక్రాన్ పుణ్యమా అని వేరే దేశాల నుంచి వచ్చినవారితో అక్కడ తొలిసారి కేసులు నమోదయ్యాయి. దీంతో ఇవాళ లాక్ డౌన్ విధించారు. ఆ దేశాలు కిరిబాటి, సమోవ. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం కిరిబాటిలో ఇప్పటిదాకా ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం. సమోవాలో కేవలం రెండంటే రెండే కేసులు వచ్చాయి.

అయితే, ప్రస్తుతం ఇంటర్నేషనల్ ఫ్లైట్లకు ఓకే చెప్పాక ఫిజి నుంచి కిరిబాటికి వచ్చిన వారిలో డజన్ల కొద్దీ ప్యాసింజర్లకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. బ్రిస్బేన్ నుంచి ప్రజలను తీసుకొచ్చిన రీపాట్రియేషన్ విమానంలోని 15 మందికి కరోనా వచ్చింది. దీంతో ఆ రెండు దేశాలూ లాక్ డౌన్ ను ప్రకటించాయి.

ప్రస్తుతం వచ్చిన కేసులన్నీ  ఒమిక్రాన్ వేనన్న అనుమానం ఉందని సమోవా ప్రధాని ఫియామి నవోమీ మతాఫా  చెప్పారు. ప్రస్తుతం అందరూ క్వారంటైన్ లోనే ఉన్నారని, సోమవారం రాత్రికి ఆంక్షలను ఎత్తేసే విషయంపై నిర్ణయం తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు.

కిరిబాటిలో సమూహ వ్యాప్తి మొదలు కావడం, ఒక కేసు రావడంతో రాజధానిలో ఆంక్షలు విధించామని కిరిబాటి అధ్యక్షుడు తానేటి మామూ చెప్పారు. ఆహారం, ఆరోగ్యం వంటి అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని, అందరూ ఇంటికే పరిమితం కావాలని ఆదేశించారు. కాగా, సమోవాలో 64 శాతం మందికి, కిరిబాటిలో 34 శాతం మందికి కరోనా వ్యాక్సిన్లు అందాయి.

More Telugu News