vaccine: ఇన్నాళ్లూ మంచానికే ప‌రిమితం.. క‌రోనా వ్యాక్సిన్ వేయించుకున్నాక లేచి న‌డుస్తోన్న వ్య‌క్తి!

  • ఝార్ఖండ్ లోని బొకారో జిల్లా, పెటార్వార్ గ్రామంలో ఘ‌ట‌న‌
  • నాలుగేళ్ల క్రితం ప్రమాదానికి గురైన‌ వ్యక్తి 
  • మాటను కూడా కోల్పోయిన వైనం
  • ఇప్పుడు కోలుకున్న వ్య‌క్తి
man walking after jab

క‌రోనా వ్యాక్సిన్ తీసుకుంటే దుష్ప్ర‌భావాలు వ‌స్తాయ‌ని ఇప్ప‌టికీ చాలా మంది అన‌వ‌స‌ర భ‌యాలు పెట్టుకుని టీకాలకు దూరంగా ఉంటున్నారు. అయితే, ఓ వ్య‌క్తి తాను వ్యాక్సిన్ వేయించుకుంటే క‌రోనా నుంచి ర‌క్ష‌ణ మాత్ర‌మే కాకుండా అంత‌కు మించిన ప్ర‌యోజ‌నాలు చేకూరాయ‌ని చెబుతున్నాడు.

తాను చాలా కాలంగా అనారోగ్యంతో మంచానికే ప‌రిమిత‌మ‌య్యాన‌ని, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మంచం దిగి నడవడం ప్రారంభించాన‌ని అంటున్నాడు. ఈ ఘటన ఝార్ఖండ్ లోని బొకారో జిల్లా, పెటార్వార్ గ్రామంలో చోటు చేసుకుంది. దులార్‌చంద్ (44) అనే వ్య‌క్తి నాలుగేళ్ల క్రితం ఓ ప్రమాదానికి గురై, మాటను కూడా కోల్పోయి మంచానికే ప‌రిమిత‌మ‌య్యాడు.

ఈ నెల 4వ తేదీన ఆయ‌న కొవిషీల్డ్ వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్నాడు. ఇన్నాళ్లూ మంచం మీద ఉన్న ఆయ‌న‌ శరీరం టీకా తీసుకున్నాక‌ స్పందించం ప్రారంభించింది. మెల్లిగా మంచం మీద నుంచి లేచి తిరిగాడు. ఈ విష‌యాన్ని పెటార్‌వార్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మెడికల్ ఇన్‌ఛార్జ్ డాక్టర్ అల్బెల్ కెర్కెట్టా మీడియాకు వివ‌రించారు.

టీకా తీసుకున్నాక‌ దులార్ చంద్ నడవడమే కాకుండా, తన స్వరాన్ని తిరిగి పొందాడని, ఇప్పుడు మాట కూడా మాట్లాడుతున్నాడ‌ని పేర్కొన్నారు. క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న త‌ర్వాతే త‌న‌ కాళ్లలో కదలిక వచ్చిందని దులార్ చంద్ కూడా వివ‌రించారు. దీంతో దులార్ చంద్ వైద్య చరిత్రను విశ్లేషించేందుకు ఓ వైద్య బృందాన్ని ఏర్పాటు చేయాలని స్థానిక వైద్యాధికారి ఆదేశించారు.

More Telugu News