Train: పశ్చిమబెంగాల్ లో ఘోర రైలు ప్రమాదం.. తొమ్మిదికి పెరిగిన మృతుల సంఖ్య!

  • జల్పాయ్ గురి జిల్లాలో రైలు ప్రమాదం 
  • పట్టాలు తప్పిన 12 బోగీలు
  • 10 మంది పరిస్థితి విషమం
  • ప్రమాద స్థలికి చేరుకున్న రైల్వే మంత్రి
8 Killed and 45 Injured As Train Derails In West Bengal

పశ్చిమబెంగాల్ లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. జల్పాయ్ గురి జిల్లా మాన్యగురి వద్ద గౌహతి-బికనీర్ ఎక్స్ ప్రెస్ రైలుకు చెందిన 12 కోచ్ లు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య తొమ్మిదికి చేరింది. గాయపడిన 45 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు గాయపడినవారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

గాయపడిన వారిలో 24 మందిని జల్పాయ్ గురి హాస్పిటల్ కు, 16 మందిని మాన్యగురి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిని సిలిగురిలోని నార్త్ బెంగాల్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించినట్టు రైల్వే అధికారులు తెలిపారు. పట్టాలు తప్పిన బోగీలు ఒకదాన్లోకి మరొకటి చొచ్చుకుపోయినట్టుగా ఉన్నాయి. ఈ బోగీల్లో పలువురు ప్రయాణికులు చిక్కుకుపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. గ్యాస్ కట్టర్ల సహాయంతో ఈ బోగీలను కట్ చేసి, వాటిలో చిక్కుపోయిన వారిని వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.

కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ ఉదయం ప్రమాద స్థలికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పరిస్థితిని వ్యక్తిగతంగా పర్యవేక్షించేందుకు వచ్చానని చెప్పారు. మరోవైపు రైల్వే మంత్రితో ప్రధాని మోదీ మాట్లాడారు. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు.

More Telugu News