COVID19: కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఆక్సిజన్ పై రాష్ట్రాలకు కేంద్రం లేఖ

  • సిద్ధం చేసి పెట్టుకోవాలన్న ఆరోగ్య శాఖ కార్యదర్శి
  • కనీసం రెండు రోజులకు సరిపోయే బఫర్ స్టాక్ తప్పనిసరి
  • పీఎస్ ఏ ప్లాంట్ల పనితీరును చెక్ చేసుకోవాలని సూచన
Center Asks States To Make Available Oxygen For Atleast 48 Hours

సెకండ్ వేవ్ లో కరోనా ఎంతలా విజృంభించిందో చూసే ఉంటాం. ఆక్సిజన్ అందక కరోనా పేషెంట్లు అల్లాడిపోయారు. అయినవారి ప్రాణాలను కాపాడేందుకు వారి కుటుంబ సభ్యులు ఆ ప్రాణ వాయువు కోసం ఎన్నెన్ని అగచాట్లు పడ్డారో, ఎన్ని గంటల సేపు క్యూలైన్లలో నిలబడ్డారో తెలిసే ఉంటుంది. ఆక్సిజన్ కొరతతో చాలా మంది ఊపిరి వదిలారు. అయితే ఈసారి అలాంటి పరిస్థితి రాకుండా కేంద్ర ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇప్పట్నుంచే అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను అప్రమత్తం చేస్తోంది.

నానాటికీ కరోనా కేసులు పెరిగిపోతుండడంతో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాశారు. ఎక్కడా ఆక్సిజన్ కొరత రాకుండా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. అన్ని ఆసుపత్రుల్లోనూ ఆక్సిజన్ స్టాక్ ను పెట్టుకోవాలన్నారు. కనీసం 48 గంటలకు సరిపడా ఉండేలా ప్రాణ వాయువు బఫర్ స్టాక్ ను సిద్ధం చేసుకోవాలని ఆయన ఆదేశించారు. ఆసుపత్రుల్లో ఇప్పటికే ఏర్పాటు చేసిన పీఎస్ఏ ప్లాంట్లు సరిగ్గా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. చాలినన్ని ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందుబాటులో ఉంచుకోవాలన్నారు.

కాగా, నిన్న ఒక్కరోజే దేశంలో దాదాపు 2 లక్షల మంది దాకా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. మొత్తం ఒమిక్రాన్ కేసులు 4,868గానే నమోదైనా.. అది ఇప్పటికే జనాల్లోకి వెళ్లిపోయిందని, ఆ కేసుల సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అందరికీ జీనోమ్ సీక్వెన్సింగ్ టెస్టులు చేసే వెసులుబాటు లేదు కాబట్టి.. బయటపడడంలేదని అంటున్నారు.

More Telugu News